ఇకపై పైలట్లకు ఆ పరీక్షలు తప్పనిసరి

Update: 2015-07-20 18:07 GMT
ఆ పరీక్షలంటే ఇంకేవో అనుకోకండి. పైలట్లలో సైకో లక్షణాలేమైనా ఉన్నాయేమో తెలుసుకునే పరీక్షలివి. కొన్ని నెలల కిందట జర్మనీకి చెందిన ఓ సైకో పైలట్ వందల మంది తన ఉన్మాదంతో ఫ్లైట్ కూల్చేసి వందల మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో అంతర్జాతీయ సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ పైలట్ తీరు అనుమానాస్పదంగా ఉన్న సంగతి తెలిసినా ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించి అంత మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఐతే మన దేశంలో ఇలాంటి ఘోరాలు జరక్కుండా చూడటానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నడుం బిగించింది.

ఇకపై దేశంలోనే ప్రతి పైలట్‌ కు ‘సైకో’ పరీక్షలు నిర్వహించడాన్ని తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం పైలట్ మానసిక స్థితిపై వివిధ దశలో పరీక్షలు జరుగుతాయి. ముందుగా అతను ఇంటర్వ్యూకు వచ్చినపుడు ఓసారి.. విధుల్లో చేరాక ఒకసారి.. విమానాలు నడపడంలో అనుభవం సాధిస్తున్న దశలో ఇంకోసారి.. ఇలా మూడు దశల్లో పరీక్షలు చేపట్టనున్నారు. సీనియర్ పైలట్లకు కూడా అప్పుడప్పుడూ పరీక్షలు తప్పనిసరి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ లాంటి సంస్థలు ఇప్పటికే స్వచ్ఛందంగా ఇలాంటి పరీక్షలు చేపడుతున్నాయి. ఇకపై ప్రతి ఎయిర్ లైన్స్ కూడా ఈ పరీక్షలు తప్పనిసరిగా చేపట్టాల్సిందేనని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News