Begin typing your search above and press return to search.

లక్షద్వీప్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి.. ఎంత ఖర్చవుతుంది?

దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షద్వీప్ కి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది, పర్మిట్ ఎలా పొందాలి మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం!

By:  Tupaki Desk   |   9 Jan 2024 1:30 PM GMT
లక్షద్వీప్ కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి.. ఎంత ఖర్చవుతుంది?
X

భారత ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం బాయ్ కాట్ మాల్ద్వీస్ అనే అంశం ట్రెండ్ అవుతుంది. ఈ సమయంలో లక్షద్వీప్ అంశం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి లక్షద్వీప్ కి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది, పర్మిట్ ఎలా పొందాలి మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం!

లక్షద్వీప్‌ కు ఎలా వెళ్లాలి?:

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ కు వెళ్లడానికి రోడ్డు, రైలు మార్గాలు లేవు. అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే వాయు మార్గం, జలమార్గంలో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్ ఉంటుంది. అందువల్ల ముందుగా కేరళ లోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడ నుంచి విమానాలు, ఓడల ద్వారా లక్షద్వీప్‌ చేరుకోవచ్చు.

కొచ్చికి విమాన మార్గం:

ఇక కొచ్చీకి చేరుకోవడానికి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి ప్రతిరోజూ విమాన సర్వీసులు ఉన్నాయి. రోడ్డు, రైల్ ఆప్షన్ కూడా ఉండనే ఉంది! కొచ్చికి వెళ్లడానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి విమాన టిక్కెట్ కనీస ధర రూ. 4,500 ఉంటుంది. ఇదే సమయంలో కొచ్చి నుంచి లక్షద్వీప్ లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి వెళ్లడానికి విమాన టిక్కెట్ కనీస ధర రూ. 5,500 ఉంటుంది.

కొచ్చికి రైలు మార్గం:

లక్షద్వీప్ వెళ్లడంకోసం ముందుగా కొచ్చికి ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే... హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్ కు రోజూ శబరి ఎక్స్‌ ప్రెస్ (17230) నడుస్తుంది. ఈ ట్రైన్ లో ప్రయాణ సమయం 23:35 గంటలు పడుతుంది. అంటే సుమారు ఒక రోజు అన్నమాట!

ఇక విజయవాడ నుంచి దాదాపు 7 రైళ్లు కేరళకు అందుబాటులో ఉండగా... విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు 4 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అలప్పీ-బొకారో ఎక్స్‌ ప్రెస్ రోజూ వైజాగ్ నుంచి కేరళకు వెళ్తుంది.

కొచ్చికి రోడ్డు మార్గం:

ఇక రోడ్డు మార్గంలో కేరళలోని కొచ్చి పట్టణాన్ని చేరుకోవడానికి పొరుగు రాష్ట్రాలతో నేషనల్ హైవేలు అనుసంధానిస్తుంటాయి. ఇందులో భాగంగా... ముంబయి, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ సాగే నేషనల్ హైవేపైనే కొచ్చీ ఉంది. ఈ నగరాల నుంచి అక్కడికి రోడ్డు మార్గాన వెళ్లొచ్చు.

కొచ్చి నుంచి లక్షద్వీప్‌:

కొచ్చి నుంచి లక్షద్వీప్‌ కు బోట్లు, ఓడలు, విమానాలు, హెలీకాప్టర్లు ఉంటాయి. పైన చెప్పుకున్నట్లుగా లక్షద్వీప్‌ లోని ఏకైక విమానాశ్రయం అగత్తికి చేరుకోవడానికి కొచ్చి నుంచి సరిగ్గా 1:30 గంటల సమయం పడుతుంది.

ఇక జల మార్గం విషయానికొస్తే... కొచ్చి నుంచి లక్షద్వీప్ కు సుమారు 7 ఓడలు అందుబాటులో ఉంటాయి! వీటిద్వారా ప్రయాణ సమయం సుమారు 14 నుంచి 18 గంటలు ఉంటుంది. ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ అనే కేటగిరీలు ఉంటాయి. ఓడను బట్టి క్లాస్‌ లను బట్టి టిక్కెట్ ధరలు రెండున్నర వేల నుంచి ఆరు వేల వరకు ఉంటాయి!

లక్షద్వీప్ కి ఎప్పుడు వెళ్లాలి?:

సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలం లక్షద్వీప్ కు వెళ్లడానికి ఉత్తమ సమయం అని అంటారు. ఇక్కడ టెంపరేచర్ 22 - 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వాస్తవానికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో అక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

లక్షద్వీప్ పర్యటనకు ఎంత ఖర్చవుతుంది?:

లక్షద్వీప్‌ లో పర్యటించేందుకు వ్యక్తిగతంగా వెళ్లేకంటే టూరిస్ట్ ప్యాకేజీల ద్వారా వెళ్లడమే బెటర్ అని పలువురు పర్యాటకులు సూచిస్తుంటారు. ఇందుకోసం వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 3 నుంచి 6 రోజులకు గాను ఈ ప్యాకేజీలు ఉంటాయి. ఈ ప్యాకేజీ కోచి నుంచి మొదలవుతుంది.

ఉదాహరణకు 3 రోజుల ప్యాకేజ్ తీసుకుంటే... ఒక రాత్రి కోచిలో, రెండు రోజులు లక్షద్వీప్‌ లో బస కల్పిస్తారు! మూడు రోజుల ప్యాకేజీ ఒక్కో వ్యక్తికి రూ. 23,000 నుంచి మొదలవువుతుంది! ఇందులో హోటల్ గదులతో పాటు, సైట్ విజిటింగ్, లోకల్ ట్రాన్స్‌ పోర్టు, ఆహారం కల్పిస్తారు. కోచికి చేరుకోవడానికి మాత్రం ఖర్చులను వ్యక్తిగతంగా భరించాలి.

పర్మిట్ పొందడం ఎలా?:

లక్షద్వీప్‌ దీవులకు వెళ్లాలంటే ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అనుమతి మంజూరు, పునరుద్ధరణ, నిరాకరణ మొదలైన అంశాల్లో సహాయం కోసం కొన్ని మార్గదర్శకాలు, నియమ నిబంధనల్ని రూపొందించారు. ఆ వివరాల కోసం https://epermit.utl.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.