Begin typing your search above and press return to search.

గట్టి ముంబైని వదిలి.. చిట్టి గోవాకు.. యశస్వి కెరీర్ లో పెద్ద తప్పు?

ముంబై.. రంజీట్రోఫీ 40 సార్లు పైగా నెగ్గిన దేశవాళీ దిగ్గజ జట్టు.. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్ లను అందించిన జట్టు.. ఒక్కసారి ముంబైకి ఆడితేనే పేరు వచ్చేస్తుంది

By:  Tupaki Desk   |   3 April 2025 8:08 AM
గట్టి ముంబైని వదిలి.. చిట్టి గోవాకు.. యశస్వి కెరీర్ లో పెద్ద తప్పు?
X

ముంబై.. రంజీట్రోఫీ 40 సార్లు పైగా నెగ్గిన దేశవాళీ దిగ్గజ జట్టు.. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్ లను అందించిన జట్టు.. ఒక్కసారి ముంబైకి ఆడితేనే పేరు వచ్చేస్తుంది ఆ క్రికెటర్ కు. ముంబైని వదిలి వేరే జట్లకు వెళ్లినవారు కూడా తప్పయిందని తిరిగొస్తుంటారు. అలాంటిది త్వరలో టీమ్ ఇండియా కెప్టెన్ అవుతాడనుకున్న యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ముంబైని ఎందుకు వదిలేస్తున్నాడో...?

జైశ్వాల్ ప్రస్తుతం టీమ్ ఇండియా టి20, టెస్టు జట్టు రెగ్యులర్ సభ్యుడు. మున్ముందు వన్డేల్లోనూ ఆడడం ఖాయం. ఇక వచ్చే జూన్ లో మొదలయ్యే ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు జైశ్వాల్ నే కెప్టెన్ చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గట్టి పట్టుగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ముంబై జట్టుకు దేశవాళీల్లో ఆడకూడదని జైశ్వాల్ అనూహ్య నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఎక్కడినుంచో ముంబైకి వచ్చి..

ఉత్తరప్రదేశ్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన జైశ్వాల్.. కేవలం క్రికెట్ పై ప్రేమతో పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చేశాడు. చాలా ఇబ్బందులను ఎదుర్కొని తన జీవిత లక్ష్యం అయిన క్రికెటర్ అయ్యాడు. దేశానికి ఆడుతున్నాడు. అద్భుతమైన భవిష్యత్ ఉన్నవాడిగా పేరుతెచ్చుకున్నాడు. అలాంటిది తన జీవితంలో ఉన్నతికి కారణమైన ముంబైని వీడడం ఆశ్చర్యమే..

కెప్టెన్సీనే కారణమా?

జూనియర్ స్థాయిలో ఏమో కానీ, సీనియర్ స్థాయిలో జైశ్వాల్ ఇప్పటివరకు ఏ జట్టుకూ కెప్టెన్సీ చేయలేదు. అయితే, టీమ్ ఇండియా కెప్టెన్ గా మాత్రం అతడికి బాగా అవకాశాలున్నాయి. రంజీల్లో ముంబై నుంచి గోవాకు మారాలని నిర్ణయించుకోవడానికి కూడా కెప్టెన్సీనే కారణమని జైశ్వాల్ స్పష్టం చేశాడు. ముంబై జట్టు కెప్టెన్సీకి అవకాశాలు తక్కువ. గోవాలో అయితే కెప్టెన్సీ సులువుగా రావొచ్చని అనుకున్నాడేమో?

కెప్టెన్సీ కాకుండా మరేదైనా కారణం అనుకుంటే.. ముంబై జట్టులో జైశ్వాల్ కు వ్యక్తిగతంగా నచ్చని అంశాలేమైనా ఉండి ఉండొచ్చు. కాగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న సిద్దేశ్ లాడ్ కూడా ఇప్పటికే ముంబైని వీడి గోవాకు ఆడుతున్నారు.

అంతా బాగానే ఉన్నా.. జైశ్వాల్ గోవా వంటి చిన్న జట్టును ఎంచుకోవడం సరైనదేనా? సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద జట్టుకు వెళ్లొచ్చు కదా? గోవాను జైశ్వాల్ ఎంత పైకి తీసుకురాగలడు? అనేది చూడాలి.