వందేమాతరం.. స్వరం మారుతున్నది.. భారత టెస్టు క్రికెట్ తరం మారుతున్నది
పై ఉదాహరణలు అన్నీ చూస్తే టీమ్ ఇండియా టెస్టు జట్టు తరం మారుతున్నది అనిపిస్తోంది.
By: Tupaki Desk | 11 May 2025 2:00 AM ISTమొన్నటికి మొన్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అదికూడా కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా..
నిన్నటికి నిన్న.. అత్యంత ముఖ్యమైన ఇంగ్లండ్ టూర్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తాడని భావించిన స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ టెస్టులకు బైబై చెప్పేశాడు..
ఈరోజుకు ఈరోజు.. మేటి బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టుల నుంచి తప్పుకోనున్నట్లు కథనాలు వస్తున్నాయి. తాను ఎంతగానో ప్రేమించే టెస్టు క్రికెట్ కు విరాట్ వీడ్కోలు పలకడం అంటే అది పెద్ద సంచలనమే.
వీరందరి మధ్యలో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టెస్టు క్రికెట్ కు గుడ్ బై పలుకుతాడని కథనాలు వచ్చాయి. ఇక ఇప్పటికే సీనియర్ బ్యాట్స్ మెన్ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలు టెస్టు జట్టుకు దూరమయ్యారు.
తరచూ గాయాలబారిన పడుతున్న మేటి పేసర్ మొహమ్మద్ షమీ కూడా టెస్టు క్రికెట్ లో ఎక్కువ కాలం కూడా కొనసాగే అవకాశం లేదు.
పై ఉదాహరణలు అన్నీ చూస్తే టీమ్ ఇండియా టెస్టు జట్టు తరం మారుతున్నది అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే మేటి బ్యాట్స్ మన్ ను వెదకాలి. కేఎల్ రాహుల్ ఓకేనే అయినా అతడి నిలకడపై అనుమానాలు ఉన్నాయి. రోహిత్ ప్లేస్ రాహుల్ కు పోతే.. ఆఖరి అవకాశంగా రిషభ్ పంత్ కు కూడా టెస్టు జట్టులో చోటు ఇవ్వొచ్చు. లేదంటే యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ ను రెగ్యులర్ సభ్యుడిగా చేయొచ్చు.
టెస్టుల్లో బౌలింగ్ ఆల్ రౌండర్ కూడా అయిన అశ్విన్ కు విదేశాల్లో ఎలాగూ అవకాశం ఇవ్వలేదు. అందుకనే ఇంగ్లండ్ టూర్ కు మరో బౌలింగ్ ఆల్ రౌండర్ జడేజాతో సరిపెట్టుకోవచ్చు. ఒకవేళ అతడు కూడా రిటైర్ అయితే అక్షర్ పటేల్ కు తోడు మరొకరిని చూడాలి. స్వదేశంలో అయితే, ముగ్గురు స్పిన్నర్లతో ఆడతాం కాబట్టి మూడో స్పిన్నర్ ఎవరా? అన్నది వెదకాలి.
షమీ మరో రెండేళ్లు కూడా ఆడే స్థితిలో లేడు అనిపిస్తోంది. అర్జంటుగా అతడికి రిప్లేస్ మెంట్ కావాలి.ప్రసిద్ధ్ క్రిష్ణ వంటివారు ఆ స్థానానికి పోటీగా ఉన్నారు.
ఇలా.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో టీమ్ ఇండియా టెస్టు జట్టు తరం మారుతున్నది.