Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలం... పాన్‌ స్టాల్‌ ఓనర్ కొడుక్కి రూ.5.8 కోట్లు!

ప్రస్తుతం ఎటు చూసినా.. క్రికెట్ పై ఆసక్తి ఉన్న ఏ ఇద్దరు మాట్లాడుకున్నా వారి మాటల మధ్యలో ఐపీఎల్ కి సంబందించిన చర్చ ఉండకుండా ఉండదు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో.

By:  Tupaki Desk   |   21 Dec 2023 8:25 AM GMT
ఐపీఎల్  వేలం... పాన్‌  స్టాల్‌  ఓనర్  కొడుక్కి రూ.5.8 కోట్లు!
X

ప్రస్తుతం ఎటు చూసినా.. క్రికెట్ పై ఆసక్తి ఉన్న ఏ ఇద్దరు మాట్లాడుకున్నా వారి మాటల మధ్యలో ఐపీఎల్ కి సంబందించిన చర్చ ఉండకుండా ఉండదు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ కి భారత్ లో ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా దుబాయ్ వేదికగా ఐపీఎల్ - 2024 మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు రికార్డులు నమోదు కాగా.. పలు ఆసక్తికర ధరలు పలికాయి. ఇప్పుడు అవన్నీ హాట్ టాపిక్ గా మారాయి.

అవును... తాజాగా దుబాయ్ వేధికగా జరిగిన ఐపీఎల్ - 2024 మినీ వేలంలో రికార్డ్ ధరలు పలికిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు ఆసిస్ ఆటగాళ్లు రికార్డ్ స్థాయిలో కోట్లు దక్కించుకుని సంచలనం సృష్టించారు. ఈ సమయలో ఎంతోమంది ప్రతిభావంతమైన ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చిన ఐపీఎల్.. తాజాగా భారత్ కు చెందిన మరో యువ క్రికెటర్ కు అద్భుతమైన తోడ్పాటునందించింది! ఇందులో భాగంగా అతడు ఐపీఎల్ వేలంలో రూ.5.8 కోట్లకు అమ్ముడయ్యాడు. ఇది ఆసక్తిగల పరిణామం!!

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 29 ఏళ్ల శుభం దూబె తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో అతడు 187.28 స్ట్రైక్‌ రేట్‌ తో 222 పరుగులు చేశాడు. ఇదే సమయంలో గౌహతీ ప్రీమియర్ లీగ్ - 2023లో 44 బంతుల్లో 89 పరుగులు చేశాడు. దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ వెలుగు ఐపీఎల్ వేలంపై పడింది. దీంతో... రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం అతణ్ని ఏకంగా రూ.5.8 కోట్లకు కొనుక్కుంది.

ప్రస్తుతం ఈ సంబరాల్లో ఉన్న శుభం దుబే... తనకు ఇన్ని కోట్లు పలకడంపై రియాక్ట్ అయ్యాడు. ఇందులో భాగంగా... తనకు అన్ని కోట్లు పలకడాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రాణించడం వల్ల వేలంలో అమ్ముడవుతానని ఆశించినా కానీ.. ఇంత పెద్ద మొత్తం వస్తుందని మాత్రం ఊహించలేదని చెబుతున్నాడు.

కాగా... నాగ్‌ పుర్‌ కి చెందిన బ్యాట్స్ మెన్ శుభం దుబే ది ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి బద్రీప్రసాద్‌ దూబె ఒక పాన్‌ స్టాల్‌ నడిపిస్తాడు. కుటుంబాన్ని పోషించడం కోసం రేయింబవళ్లు కష్టపడ్డాడు. ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఈ స్థితికి వచ్చాడు. ఓ దశలో గ్లోవ్స్‌ కొనుక్కోవడం కూడా తనకు కష్టమైందని శుభం చెప్పాడు. దీంతో... ఇంతకాలం అతడు నిజాయితీగా పడిన కష్టం ఫలించిందంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.