Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్.. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్

దేశమంతా ప్రస్తుతం పాకిస్థాన్ పై జరిపిన ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించకుంటున్న వేళ.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

By:  Tupaki Desk   |   7 May 2025 11:45 PM IST
Rohit Sharma Retires from Test Cricket
X

దేశమంతా ప్రస్తుతం పాకిస్థాన్ పై జరిపిన ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించకుంటున్న వేళ.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరొక్క నెల రోజుల్లో కీలకమైన ఇంగ్లండ్ టూర్ ప్రారంభం కానుండగా.. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే గత ఏడాది జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ నెగ్గిన అనంతరం రోహిత్ టి20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టెస్టులకూ బైబై చెప్పేశాడు.

ఇప్పటివరకు 67 టెస్టులు ఆడిన రోహిత్‌.. 4,301 పరుగులు చేశాడు. చివరగా 2024 డిసెంబరులో జరిగిన ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్ లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే, కెప్టెన్ గా ఉన్నప్పటికీ ఆ సిరీస్ లో పేలవంగా ఆడడంతో ఐదో టెస్టు నుంచి తప్పించారు. టెస్టుల్లో 40.57 సగటుతో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్.. ఇప్పుడు కేవలం వన్డే ఆటగాడిగా మాత్రమే ఉండనున్నాడు.

ఉద్వాసన తప్పదనేనా?

రోహిత్ శర్మ ఇంత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే.. మొన్నటికి మొన్న కూడా రోహిత్ సారథ్యంలోనే టీమ్ ఇండియా ఇంగ్లండ్ లో టూర్ చేస్తుందని కథనాలు వచ్చాయి. ఇంగ్లండ్ వంటి గట్టి జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ అంటే కఠినమైనది. అందుకే రోహిత్ స్థాయి ఆటగాడితోనే టూర్ కు వెళ్లాలని భావించారు. అయితే, ఇప్పుడు ఉన్నట్లుండి రిటైర్ కావడం వెనుక అతడిని ఎంపిక చేయరని తెలియడమే కారణం అంటున్నారు. సెలక్టర్లు తనను ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక చేయరని తెలియడంతోనే రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. కాగా, రోహిత్ ఫామ్ కొన్నాళ్లుగా టెస్టుల్లో రాణించడం లేదు. మరోవైపు ఇంగ్లండ్ టూర్ తో కొత్త ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ మొదలుకానుంది. 38 ఏళ్లు నిండిన రోహిత్ కంటే యువ ఆటగాడితో వెళ్తేనే ఈ సైకిల్ లో రాణించగలమనేది సెలక్టర్ల ఆలోచనగా భావిస్తున్నారు.

టీమ్ ఇండియా తరఫున 2007లోనే టెస్టులు, వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. టెస్టుల్లోకి రావడానికి 2013 వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. వైట్ బాల్ (టి20, వన్డే) క్రికెటర్ గా ముద్రపడడం, టెస్టుల్లో విఫలం కావడమే దీనికి కారణం. అయితే, 2018-19 తర్వాత రోహిత్ టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడు అయ్యాడు. 2021 నుంచి కెప్టెన్ కూడా అయ్యాడు.

రోహిత్ 273 వన్డేల్లో 11,168 పరుగు చేశాడు. మూడు డబుల్ సెంచరీలు కొట్టాడు. 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ప్రస్తుతానికి ఏడాది 5 వన్డేలు కూడా జరగడం లేదు. టి20 ప్రపంచకప్ సాధించిపెట్టిన రోహిత్.. చాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు చేర్చాడు. ఇప్పుడు టెస్టులకు వీడ్కోలు పలకడంతో వన్డేల్లోనే అతడు కనిపించే చాన్సుంది. ప్రస్తుతం ఐపీఎల్ లోనే బాగా ఇబ్బంది పడుతున్నందున వచ్చే సిరీస్ నాటికి వన్డేలకూ బైబై చెప్పినా ఆశ్చర్యం లేదు.