Begin typing your search above and press return to search.

రోహిత్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్..

గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ ప్రపంచంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ అంశానికి ఎట్టకేలకు తెరపడింది.

By:  Tupaki Desk   |   18 July 2026 11:12 AM IST
రోహిత్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్..
X

గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ ప్రపంచంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ అంశానికి ఎట్టకేలకు తెరపడింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే తర్వాత ‘హిట్‌మ్యాన్’ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడనే వార్తలు సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలోనూ దావానంలా వ్యాపించాయి. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం రోహిత్‌ను తప్పించే ఆలోచనలో ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ ప్రచారాలన్నింటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా అత్యంత స్పష్టమైన సమాధానం ఇచ్చింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

బోర్డు ఏం చెప్పిందంటే..?

ఒక ప్రముఖ బీసీసీఐ అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "రోహిత్ శర్మ భవిష్యత్తుపై బోర్డులో ఎలాంటి చర్చ జరపలేదు. లార్డ్స్ వేదికగా జరగబోయే వన్డే మ్యాచ్ అతని కెరీర్‌లో చివరి మ్యాచ్ కాబోదు. మీడియాలో వస్తున్నవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే" అని స్పష్టం చేశారు. బీసీసీఐ ప్రకటన ప్రకారం.. రోహిత్ శర్మ భారత వన్డే జట్టులో అత్యంత కీలక సభ్యుడిగానే కొనసాగుతాడు. భవిష్యత్ ప్రణాళికల్లో ఆయనకు ఇప్పటికీ ప్రాధాన్యత ఉందని, ఫిట్‌నెస్, ఫామ్ బాగున్నంత కాలం అతను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని స్పష్టం చేసింది. దీంతో రోహిత్‌ను జట్టు నుంచి తప్పించబోతున్నారన్న పుకార్లకు పూర్తిగా చెక్ పడింది.

ఊపిరి పీల్చుకున్న అభిమానులు

ఇటీవల కాలంలో రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. లార్డ్స్ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో అభిమానులు బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం అభిమానులే కాకుండా పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ దశలో రోహిత్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి సేవలు జట్టుకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లో బీసీసీఐ నుంచి వచ్చిన ఈ అధికారిక ప్రకటన రోహిత్ అభిమానులకు భారీ ఊరటనిచ్చింది. ప్రస్తుతం అతనిపై ఎలాంటి రిటైర్మెంట్ ఒత్తిడి లేదని.. జట్టులో అతని స్థానం అత్యంత సురక్షితంగానే ఉందని బోర్డు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.

కీలక టోర్నీలకు హిట్‌మ్యాన్ దూకుడు

ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ మరికొంత కాలం భారత వన్డే జట్టుకు తన అద్భుత సేవలను అందించే అవకాశం కనిపిస్తోంది. రాబోయే ఐసీసీ మెగా టోర్నమెంట్లలో కూడా అతని అనుభవం, దూకుడైన ఓపెనింగ్ బ్యాటింగ్, తిరుగులేని నాయకత్వం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రోహిత్ రిటైర్మెంట్‌పై వినిపించిన అన్ని పుకార్లను బీసీసీఐ ఒక్క మాటతో పటాపంచలు చేయడంతో హిట్‌మ్యాన్ అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు.