ఎజెండా ప్రకారం కామెంట్రీ.. క్రికెట్ జర్నలిజం..రోహిత్ నిప్పులు
భారతీయ కామెంటేటర్లు కొందరు ఓ క్రికెటర్ టాలెంట్ ను పట్టించుకోకుండా, అతడి వ్యక్తిగత జీవితాన్నిటార్గెట్ చేస్తుంటారని, ఇది తగదని రోహిత్ అన్నాడు.
By: Tupaki Desk | 8 May 2025 8:00 PM ISTభారత క్రికెటర్ల విషయంలో ఎప్పుడూ విదేశీ కామెంటేటర్లు, విదేవీ మీడియా పక్షపాతం చూపుతుందనే విమర్శలు వస్తుంటాయి. కొందరిని టార్గెట్ చేస్తారనే ఆరోపణలు వినిపిస్తాయి. కానీ, ఈసారి భారత కామెంటేటర్లనే తప్పుబట్టాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్ జరుగుతుండగానే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన రోహిత్.. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది.
భారతీయ కామెంటేటర్లు కొందరు ఓ క్రికెటర్ టాలెంట్ ను పట్టించుకోకుండా, అతడి వ్యక్తిగత జీవితాన్నిటార్గెట్ చేస్తుంటారని, ఇది తగదని రోహిత్ అన్నాడు. అసలు కామెంటేటర్లకే ఏదో ఒక ఎజెండా ఉంటుందని తెలిపాడు. కొన్నిసార్లు విదేశీ కామెంటేటర్ల తీరే బాగుంటుందని కితాబిచ్చాడు.
కామెంట్రీనే కాదు.. భారత్ లో క్రికెట్ జర్నలిజం తీరు కూడా మారాల్సిన ఆవశ్యకత ఉందని రోహిత్ పేర్కొన్నాడు. అసలు వార్తలను వదిలేసి.. కొందరు కావాలనే వివాదాలు రేపే ఉద్దేశంలో ఉంటారని, నాణ్యమైన జర్నలిజం తగ్గిపోతుందనే ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతా లైక్ లు.. వ్యూస్ కోసమే..
ఆట గురించి చర్చించే రోజులు పోయి.. ఇప్పుడు ఎక్కువ లైక్స్, వ్యూస్ గురించి చూసే రోజులు వచ్చాయని రోహిత్ నిందించాడు.
వ్యూహాలు, విశ్లేషణ వదిలేసి ఇందుకోసం ఆట వదిలేసి.. వివాదాలను తెరపైకి తెస్తున్నారని తప్పుబట్టాడు.
మసాలా పూసి మారేడు కాయ..
వాస్తవానికి చాలామంది అభిమానులు క్రికెట్ గురించి తెలుసుకోవడానికే ఆసక్తిగా ఉంటారని.. అలాంటివారికి మసాలా పూసి కామెంటేటర్లు చేసే కామెంట్రీ ఎందుకని రోహిత్ ప్రశ్నించాడు. ప్లేయర్ ఫామ్ ఎందుకు కోల్పోయాడు? ఏం తప్పులు చేశాడు? అనేవాటినే అభిమానులు చూస్తారని.. వ్యక్తిగత విషయాలు కాదని తెలిపాడు. ఇవన్నీ చూసుకోకుండా కామెంటేటర్లు మాట్లాడేస్తూ ఉంటారని చెప్పాడు. విఫలమైతే విమర్శలు చేయొచ్చని.. దానికీ ఓ పద్ధతి ఉంటుందని రోహిత్ వాపోయాడు.
ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ ఫిట్ నెస్ గురించి.. వైఫల్యాల మీద.. అతడు టెస్టులకు పనికిరాడనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై ఓసారి స్టేడియంలోనే రోహిత్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ సందర్భంగా అతడి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఇంతకూ టార్గెట్ అయిన ప్లేయర్ ఎవరూ అంటే..? అది రోహిత్ శర్మనే అనుకోవాలి.