బయట గెలిచి.. ఇంట ఓటమి.. ఒకే ఒక జట్టు.. చెప్పుకోండి దాని పేరు
ఐపీఎల్ లో ఏ జట్టుకైనా హోం గ్రౌండ్ (సొంత మైదానం) అనేది చాలా ముఖ్యం. తమ హోం గ్రౌండ్ లో ఆ జట్లు చెలరేగిపోతుంటాయి.
By: Tupaki Desk | 19 April 2025 9:04 AMపెద్దపెద్ద స్టార్లు లేరా..? అంటే అదేం కాదు.. టాలెంటెడ్ బ్యాట్స్ మెన్ లేరా? అంటే అదేం కాదు.. మంచి మంచి బౌలర్లు లేరా? అంటే అదీ కాదు.. కీలక ఆల్ రౌండర్లు లేరా? అంటే అలా కూడా కాదు.. కానీ, 17 సీజన్లలో ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ కొట్టలేదు.
ప్రతిసారీ ఈ సాలా కప్ నమదే (ఈసారి కప్ మనదే) అంటూ బరిలో దిగడం.. ఖాళీ చేతులతో వెనుదిరగడం.. వచ్చే సాలా చూసుకుందాం అని సరిపెట్టుకోవడం.. 17 ఏళ్లుగా జరుగుతున్నది ఇదే.. ఇక్కడితో తెలిసిపోతోంది ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అని.
ఐపీఎల్ లో ఏ జట్టుకైనా హోం గ్రౌండ్ (సొంత మైదానం) అనేది చాలా ముఖ్యం. తమ హోం గ్రౌండ్ లో ఆ జట్లు చెలరేగిపోతుంటాయి. ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ లో వీర విహారం చేస్తుంటుంది. స్థానిక పరిస్థితులు తెలిసి ఉండడమే దీనికి కారణం.
అదేంటో మరి.. బెంగళూరుకు మాత్రం ఈ సీజన్ లో వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. వాస్తవానికి గత సీజన్ చాంపియన్, రన్నరప్ ఏదీ కాకున్నా ఈ సీజన్ తొలి మ్యాచ్ బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో కోల్ కతాతో ఆడింది. ఇలా బయటి మైదానాల్లో విజయాలు సాధిస్తున్న బెంగళూరు.. సొంతగడ్డపై మాత్రం చేతులెత్తేస్తోంది. శుక్రవారం ఆర్సీబీ బెంగళూరు ‘చిన్నస్వామి’ మైదానంలో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి తేలిపోయారు. దీంతో ఓటమి తప్పలేదు. తద్వారా రెండు చెత్త రికార్డులు ఆ జట్టు ఖాతాలో చేరాయి.
ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఏడు మ్యాచ్ లకు గాను.. నాలుగు నెగ్గగా.. అన్నీ బయట మైదానాలే. ఈ సారి సొంత మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవనిది ఆర్సీబీ మాత్రమే. ఇదే సమయంలో ఒకే గ్రౌండ్ లో అత్యధికసార్లు ఓడిన తొలి జట్టు కూడా ఆర్సీబీనే. బెంగళూరులో 46 మ్యాచ్ లలో ఓడిపోయి.. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ (45) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.