ఐపీఎల్-18.. దశాబ్దాల సొంతగడ్డ కోటలు కూలుతున్నాయ్
ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ దుమ్మురేపుతోంది...
By: Tupaki Desk | 8 April 2025 2:05 PM ISTఏ ముహూర్తాన మొదలైందో కానీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ దుమ్మురేపుతోంది... ఇంతవరకు కప్ కొట్టని జట్లు దూసుకెళ్తుండగా.., రికార్డు స్థాయిలో చాంపియన్ లుగా నిలిచిన జట్లు కనీసం ఒక్క గెలుపు కోసం మొహం వాచిపోతున్నాయి. ఈ క్రమంలో దశాబ్దాల రికార్డులు బద్దలవుతున్నాయి.
ఐపీఎల్ ఐదుసార్లు చాంపియన్ లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. మరే జట్టుకూ సాధ్యం కాని ఘనత ఇది. భవిష్యత్ లో మరే జట్టుకైనా సాధ్యం అవుతుందా? అని కూడా చెప్పలేం. అయితే, ఈ జట్లకు తమ సొంత మైదానాలు పెట్టని కోటలు. ఇక్కడ జరిగే మ్యాచ్ లలో ఈజీగా గెలుపొంది ప్లేఆఫ్స్ చేరిన సంవత్సరాలు ఎన్నో?
ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం సొంతగడ్డల కంచుకోటలు బద్ధలువుతున్నాయి. 17 ఏళ్ల తర్వాత చెన్నైలో చెన్నై ఓటమి, 15 ఏళ్ల తర్వాత చెన్నైలో ఢిల్లీ గెలుపు, 10 ఏళ్ల తర్వాత ముంబైలో ఆర్సీబీ విజయం దీనికి నిదర్శనం.
ఆర్సీబీ అంటూ ముద్దుగా షార్ట్ కట్ లో పిలుచుకునే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇంతవరకు కప్ కొట్టలేదు. ఎప్పుడో తొలి సీజన్ 2008లో చెన్నై సూపర్ కింగ్స్ ను దాని సొంత గడ్డ చెపాక్ మైదానంలో ఓడించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చెపాక్ లో చెక్ పెట్టగలిగింది.
ఇదే ఆర్సీబీ తాజాగా సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. పదేళ్ల తర్వాత వాంఖడేలో ముంబైపై ఆర్సీబీ గెలవడం గమనార్హం.
మరోవైపు ఐపీఎల్ లో టైటిల్ కొట్టని మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో చెన్నైలో చెన్నైని 15 ఏళ్ల తర్వాత మట్టికరిపించింది.
ముంబై, చెన్నై హోం గ్రౌండ్స్ లో ఓడిపోవడానికి ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ బలం పెరగడమే కాదు.. ఎన్నడూ లేనంతగా ముంబై, చెన్నై బలహీనపడడం కూడా కారణమే.