ఐపీఎల్ ప్రత్యర్థులూ బహుపరాక్.. ఆ ఎక్స్ ప్రెస్ యమా జోరందుకుంది
ముంబై ఇండియన్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుచేసింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో నెగ్గింది.
By: Tupaki Desk | 21 April 2025 9:06 AM ISTఐపీఎల్ -18లో తొలి ఐదు మ్యాచ్ లలో నాలుగు పరాజయాలు.. కీలక బ్యాట్స్ మెన్ ఫామ్ లో లేరు.. మేటి పేస్ బౌలర్ జట్టుకు అందుబాటులో లేడు.. జట్టులో అసలు జోష్ లేదు.. ఇక ఒకటీ అరా మ్యాచ్ లలో ఓడితే ఇంటికే..? ఐదుసార్లు టైటిల్ కొట్టిన ఆ జట్టు ఈసారి అందరికంటే ముందు లీగ్ నుంచి ఔట్ అనే వెక్కిరింతలు.. సరిగ్గా వారం కిందటి వరకు ఇదీ అంచనా..
కానీ, వారంలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలు.. నెమ్మదిగా జోరందుకునే జట్టుగా పేరున్న ఆ జట్టు ఎక్స్ ప్రెస్ వేగంలోకి వచ్చేసింది. ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.
ముంబై ఇండియన్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుచేసింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. వాస్తవానికి ఇక్కడ ఆ జట్టు గెలిచిన విధానమే మిగతా ప్రత్యర్థులకు పెద్ద వార్నింగ్ అని చెప్పాలి.
చెన్నై కూడా ఈ సీజన్ లో దారుణంగానే ఆడుతోంది. అయితే, దిగ్గజం ధోనీ కెప్టెన్సీ తీసుకున్నాక లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన గత మ్యాచ్ లో గెలవడంతో అంతా బాగైనట్లేనని భావించారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ఆదివారం ముంబైపై తొలుత బ్యాటింగ్ చేసి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మాత్రం లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి కొట్టేసింది.
45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో రోహిత్ 76 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లోనే 5 సిక్సులు, 6 ఫోర్లతో 68 పరుగులు చేయడంతో ముంబై తేలిగ్గా గెలిచేసింది. హ్యాట్రిక్ విజయం సాధించింది.
ఇక ముంబై బౌలింగ్ కూడా రాటుదేలింది. గాయం నుంచి కోలుకుని కాస్త ఆలస్యంగా జట్టుతో చేరిన పేసర్ బుమ్రా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇతడికి దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ అండగా నిలుస్తుండడంతో ముంబై రాత మారింది. మిచెల్ శాంట్నర్ తన నాణ్యమైన స్పిన్ తో మరింత అండగా నిలుస్తున్నాడు.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. అసలు ఫామ్ లోనే లేక.. ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్న క్రమంగా జోరందుకుంటున్నాడు. చెన్నైపై అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. సూర్య కూడా టచ్ లోకి వచ్చాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండడంతో ముంబై ఇక మొదలెట్టినట్లే అనిపిస్తోంది.
ఈ సీజన్ లో వరుస విజయాలు సాధిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు తొలి పరాజయం రుచి చూపింది ముంబైనే. ఆ తర్వాత సన్ రైజర్స్ ను కొట్టేసింది. తాజాగా చెన్నైనూ చుట్టేసింది. ముంబై ప్రస్తుతం నాలుగు విజయాలతో 8 పాయింట్ల వద్ద పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే మళ్లీ పైకి లేవడం ఖాయం. అందుకే ప్రత్యర్థి జట్లూ బహుపరాక్ అని చెప్పాల్సి వస్తోంది.