కెప్టెన్సీ కాదు.. వైస్ కెప్టెన్సీ లేదు.. మేటి పేసర్ కు బీసీసీఐ షాక్
గత ఏడాది ఆఖరులో ప్రారంభమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) తొలి టెస్టులో టీమ్ ఇండియాను నడిపించి.. గెలిపించిన అతడికి షాక్ ఇచ్చింది.
By: Tupaki Desk | 5 May 2025 3:30 PMగత ఏడాది ఆఖరులో ప్రారంభమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) తొలి టెస్టులో టీమ్ ఇండియాను నడిపించి.. గెలిపించిన అతడికి షాక్ ఇచ్చింది. చివరి టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ ను తప్పించి అతడికి కెప్టెన్సీ ఇచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పుడు ఏకంగా షాక్ ఇచ్చింది.
ఆస్ట్రేలియా టూర్ లో టీమ్ ఇండియా తరఫున అద్భుత ప్రదర్శన చేసిన మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను భవిష్యత్ కెప్టెన్ గా భావించారు. అయితే, చివరి టెస్టులో అనూహ్యంగా వెన్ను గాయంతో అతడు తప్పుకోవాల్సి వచ్చింది. ఎన్నాళ్లుగానో ఇబ్బంది పెడుతున్న ఈ గాయం అతడిని రెండుమూడు నెలలు మైదానానికి దూరం చేసింది.
ఇక గాయం కారణంగానే చాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడలేకపోయిన బుమ్రా.. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా క్రికెట్ లోకి పునరాగమనం చేశాడు.
వరుసగా ఆరు విజయాలతో ఇప్పుడు ముంబై అద్భుతంగా ఆడుతున్నదీ అంటే దానికి కారణం బుమ్రానే. ఇక టీమ్ ఇండియా వచ్చే నెలలో ఇంగ్లండ్ లో పర్యటించనుంది.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్, ఫిట్ నెస్ నేపథ్యంలో టెస్టులను అతడిని పరిగణించకపోవచ్చు అనే అభిప్రాయం మొన్నటివరకు నెలకొంది. ఇప్పుడు మాత్రం రోహిత్ నే కెప్టెన్ చేస్తారని స్పష్టమైంది. ఐదు టెస్టుల సిరీస్ లో బలమైన కెప్టెన్ ఉండాలని భావించడమే దీనికి కారణం.
అయితే, మరి వైస్ కెప్టెన్ ఎవరు?
రోహిత్ కెప్టెన్ అయితే వైస్ కెప్టెన్సీ మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకే దక్కుతుందని భావించారు. ఐపీఎల్ లో అద్భుతంగా బంతులేస్తున్న బుమ్రా కచ్చితంగా కాబోయే కెప్టెన్ అని కూడా ఊహించారు.
కానీ, ఇంగ్లండ్ టూర్ కు బుమ్రా వైస్ కెప్టెన్ కాదని తేలిపోయింది. దీనికి కారణం.. అతడి గాయాల సమస్యేనని అంటున్నారు. బీసీసీఐ నుంచి వస్తున్న కథనాల ప్రకారం ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండగలిగే ఆటగాడినే వైస్ కెప్టెన్ చేస్తారట.
అంటే బుమ్రా ఇంగ్లండ్ టూర్ లో ఐదు టెస్టులూ ఆడతాడని చెప్పలేని పరిస్థితి నెలకొంది. బుమ్రా గాయం తిరగబెట్టే ప్రమాదం ఉన్నందునే వైస్ కెప్టెన్ చేయడం లేదని సమాచారం. అతడికి టెస్టు విడిచి టెస్టు అవకాశం ఇస్తారట.
బుమ్రాను కాదంటే.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ ల పేర్లు వైస్ కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ అనంతరం టీమ్ ఇండియా ఇంగ్లండ్ వెళ్తుంది. జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.