Begin typing your search above and press return to search.

ఐపీఎల్-డబ్ల్యూటీసీ ఫైనల్.. ఉండేదెవరో? వెళ్లేదెవరో? అదే భారత్ అయితే?

రబడ (దక్షిణాఫ్రికా), మార్క్ రమ్ (లక్నో), కార్బిన్ బాష్, రికెల్టన్ (ముంబై), స్టబ్స్ (ఢిల్లీ), మార్కో యాన్సన్ (పంజాబ్), కగిసో రబడా (గుజరాత్), లుంగి ఎంగిడి (బెంగళూరు) వీరంతా దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులు.

By:  Tupaki Desk   |   14 May 2025 5:30 PM
ఐపీఎల్-డబ్ల్యూటీసీ ఫైనల్.. ఉండేదెవరో? వెళ్లేదెవరో? అదే భారత్ అయితే?
X

మాంచి జోరుమీద సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ లో సంచలన ముగింపు ఖాయం అని అందరూ భావించారు. ఎవరూ ఊహించని విధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్, ఢిల్యీ క్యాపిటల్స్ వంటి జట్లు తొలిసారి టైటిల్ కొట్టేస్తాయా? గుజరాత్ టైటాన్స్ మళ్లీ చాంపియన్ అవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కానీ, అనూహ్యంగా భారత్-పాకిస్థాన్ యుద్ధ వాతావరణంతో పరిస్థితులు మారిపోయాయి.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐపీఎల్ తొలిసారి వాయిదా పడింది. లీగ్ ను పూర్తిగా వాయిదా వేస్తారని భావించినా వారం పాటు వాయిదాతో సరిపెట్టారు. ఈ నెల 8న మధ్యలో ఆగిపోయిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ సహా ఈ నెల 17 నుంచి ఐపీఎల్ రీస్టార్ కానుంది. దీంతో 10 రోజుల పాటు లీగ్ కు అంతరాయం కలిగింది అన్నమాట. అప్పటికి 57 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 17 మ్యాచ్ లు మిగిలాయి.

మార్చి 22న మొదలైన ఐపీఎల్ మే 25న ముగియాల్సి ఉంది. అంతా షెడ్యూల్ ప్రకారమే జరిగితే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం చూస్తే మే 17న రీస్టార్ అయి జూన్ 3న ఫైనల్స్ తో ముగియనున్నాయి. మే 27తో లీగ్ మ్యాచ్ లు పూర్తవుతాయి. 29వ తేదీ నుంచి ప్లేఆఫ్స్ సాగుతాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది.

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2023-25 సైకిల్ కు సంబంధించిన ఫైనల్ జూన్ 11 నుంచి 15 మధ్య జరగనుంది. దీనికి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాలు తమ జట్లను ప్రకటించేశాయి. కానీ, ఆటగాళ్లు జూన్ వరకు ఐపీఎల్ లో ఉంటే ఎలా? అందుకే తమ వారిని మే 26న నాటికి వెనక్కు వచ్చేయమని దక్షిణాఫ్రికా బోర్డు కోరింది.

దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ లో చాలా కీలకంగా ఉన్నారు. రబడ (దక్షిణాఫ్రికా), మార్క్ రమ్ (లక్నో), కార్బిన్ బాష్, రికెల్టన్ (ముంబై), స్టబ్స్ (ఢిల్లీ), మార్కో యాన్సన్ (పంజాబ్), కగిసో రబడా (గుజరాత్), లుంగి ఎంగిడి (బెంగళూరు) వీరంతా దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులు. ఐపీఎల్ లో వీరి జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి.

మరోవైపు ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య మే 29 నుంచే సిరీస్ మొదలవనుంది. దీనికోసం ఈ రెండు జట్ల ఆటగాళ్లు వెళ్లక తప్పదు.ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బట్లర్ అద్భుత ఫామ్ తో గుజరాత్ టైటాన్స్ ను ముందుండి నడిపిస్తున్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం పేసర్లు స్టార్క్, హేజెల్‌వుడ్. వీరిద్దరూ ఢిల్లీ, బెంగళూరుకు ఆడుతున్నారు. వీరి జట్లు ప్లేఆఫ్స్, ఫైనల్ చేరితే ఎంతమేరకు అందుబాటులో ఉంటారనేది చెప్పలేం. జూన్ 3న ఫైనల్స్ ఆడి ఇటునుంచి ఇటే ఇంగ్లండ్ విమానం ఎక్కుతారేమో..? అసలు అందుబాటులో లేకుంటే వీరి స్థానంలో భారత దేశవాళీ ఆటగాళ్లను ఆడించే చాన్సుంది.

కొసమెరుపు: 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మొదటినుంచి ముందుంది టీమ్ ఇండియా. కానీ, న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో 0-3తో, ఆస్ట్రేలియాలో 1-3తో టెస్టు సిరీస్ లను కోల్పోయి ఫైనల్ బెర్తు మిస్ చేసుకుంది. మన స్థానంలో దక్షిణాఫ్రికా చాన్స్ కొట్టేసింది. ఐపీఎల్ వాయిదా పడిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ గనుక ఫైనల్ చేరి ఉంటే?