Begin typing your search above and press return to search.

సంచలనం.. ఐపీఎల్‌-18 సీజన్‌ రద్దు..?

అయితే, యుద్ధం తీవ్రం అయ్యే పరిస్థితుల్లో ఐపీఎల్‌ మొత్తాన్నే రద్దు చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   8 May 2025 11:08 PM IST
సంచలనం.. ఐపీఎల్‌-18 సీజన్‌ రద్దు..?
X

ముంబై దాడులు జరిగినా.. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినా.. కొవిడ్‌ సంక్షోభం ఎదురైనా 17 సంవత్సరాలుగా వీలైతే విదేశంలో నిర్వహిస్తూ వస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఈ ఏడాది రద్దు అంచున ఉంది. పాకిస్థాన్‌ తో యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం అత‍్యవసరంగా సమావేశం కానుంది. ఇప్పటికే గురువారం ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను భద్రతా కారణాల రీత్యా రద్దు చేశారు. అయితే, యుద్ధం తీవ్రం అయ్యే పరిస్థితుల్లో ఐపీఎల్‌ మొత్తాన్నే రద్దు చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరీ ముఖ్యంగా ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఐపీఎల్‌ ను ప్రస్తుతానికి రద్దు చేయడమే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లీగ్‌ కోసం వెస్టిండీస్‌ దీవులు, శ్రీలంక, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాలకు చెందిన క్రికెటర్లు భారత్‌ లోని వేర్వేరు నగరాల్లో ఉన్నారు. వీరి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేకున్నా.. ముందుజాగ్రత్త చర్యలు అవసరం. అందుకనే లీగ్‌ను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కథనాలు వస్తు‍న్నాయి.

తర్వాత నిర్వహణ?

ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ కలిపి ఐపీఎల్‌ 18లో మొత్తం 74 మ్యాచ్‌లు. గురువారం 58వ మ్యాచ్‌ పంజాబ్‌-ఢిల్లీ మధ్య జరుగుతుండగా రద్దయింది. ఇంకా 16 మ్యాచ్‌ లు మాత్రమే ఉన్నాయి. పాకిస్థాన్‌ తో యుద్ధం అయిపోయాక వీటిని మళ్లీ నిర్వహిస్తారా? అసలు యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది? అనేది చూడాలి. 2009లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. కొవిడ్‌ వ్యాప్తి రీత్యా 2020లో సెప్టెంబరులో లీగ్‌ ను దుబాయ్‌ లో నిర్వహించారు. ఇప్పుడు కూడా ఐపీఎల్‌ ను అదే విధంగా చేస్తారా? అన్నది చూడాలి.

పాక్‌తో యుద్ధం ముగిశాక.. మళ్లీ లీగ్‌ నిర్వహణ అంటే చాలా కష్టంతో కూడుకున్నదే. ఎందుకంటే ఆయా దేశాల క్రికెటర్లు వారి జాతీయ జట్లకు ఆడుతుంటారు. వారందరినీ వెనక్కుపిలిచి మళ్లీ మ్యాచ్‌ల నిర్వహణకు పూనుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వారి దేశాల బోర్డులను ఒప్పించాలి.

ఇక ఐపీఎల్‌ చరిత్రలో భారత్‌ లో జరుగుతుండగా రద్దు కావడం ఇదే తొలిసారి. అంతేకాక.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ వంటి ఎప్పుడూ టైటిల్‌ కొట్టని జట్లు మాంచి ఊపు మీద ఉండగా ఇలా జరగడం ఒక విధంగా వాటికీ బ్యాడ్‌ లక్కే.

అయితే, రద్దు ఆర్థికంగా నష్టం. అలాగని ఇప్పటికిప్పుడు తటస్థ వేదిక అయిన దుబాయ్‌కు తరలింపు కూడా కష్టమే కాబట్టి.. ఐపీఎల్‌ కు తాత్కాలిక విరామం ఇవ్వడమే ఉత్తమం అని బీసీసీఐ భావిస్తుండవచ్చు.శుక్రవారం నాటి బీసీసీఐ సమావేశం తర్వాతనే ఐపీఎల్‌ రద్దు మీద క్లారిటీ రానుంది.