ఈ ఆధునిక భారత క్రికెట్ దిగ్గజాలు పాక్ తో టెస్టు మ్యాచ్ ఆడలేరిక..
క్రికెట్ లో గత 20 ఏళ్లలో టి20లు వచ్చి ఉండొచ్చు గాక.. గత 40 ఏళ్ల నుంచి వన్డేలు బాగా జరిగి ఉండొచ్చుగాక.. కానీ, అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా టెస్టులదే అగ్ర తాంబూలం.
By: Tupaki Desk | 26 April 2025 2:00 AM ISTక్రికెట్ లో గత 20 ఏళ్లలో టి20లు వచ్చి ఉండొచ్చు గాక.. గత 40 ఏళ్ల నుంచి వన్డేలు బాగా జరిగి ఉండొచ్చుగాక.. కానీ, అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా టెస్టులదే అగ్ర తాంబూలం.
అంతెందుకు..ప్రపంచ బ్యాటింగ్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్ వంటి వారి నుంచి నేటి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరకు టెస్టు క్రికెట్ ను అమితంగా ఇష్టపడతారు.
గంటలకు గంటలు ఆడే సామర్థ్యం.. ఆటగాడిలోని సత్తా బయటపడే సందర్భం ఏదైనా ఉందంటే అది టెస్టు క్రికెట్ మాత్రమే. అలాంటి టెస్టు మ్యాచ్ లు పక్కపక్కనే ఉన్న రెండు దేశాలు తలపడక 18 ఏళ్లు అవుతోంది అంటే నమ్ముతారా?
భారత్ లో 2007 చివరలో పర్యటించింది పాకిస్థాన్ జట్టు. నాడు మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 0-1తో ఓడింది. ఇక 2008 చివరలో ముంబై దాడులు జరగడంతో భారత్ –పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించాయి.
2007 చివరి నుంచి రోహిత్ శర్మ, 2008 నుంచి విరాట్ కోహ్లి, 2009 నుంచి రవీంద్ర జడేజా వంటి స్టార్ల అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. వీరు ముగ్గురూ మూడు ఫార్మాట్లలోనూ గొప్ప క్రికెటర్లుగా ఎదిగారు.
కోహ్లి వందకు పైగా టెస్టులు ఆడాడు. జడేజా 80, రోహిత్ 67 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరేకాదు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 100కు పైగా టెస్టులు ఆడాడు. కానీ, ఈ ఆటగాళ్లు ఎవరూ పాకిస్థాన్ తో ఒక్కటంటే ఒక్క టెస్టు కూడా ఆడకపోవడం గమనార్హం.
టెస్టుల్లో 500 పైగా వికెట్లు తీసిన అశ్విన్ ఎలాగూ రిటైరయ్యాడు. కెరీర్ చివరలో ఉన్న.. కోహ్లి, రోహిత్, జడేజాలు పాకిస్థాన్ తో టెస్టు ఆడే చాన్సే లేదు. ఆ దేశంతో మన దేశం క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంతో ముందుముందు అవకాశం లేనట్లే.
ఇలాగైతేనే..
వన్డేలు, టి20లలో ప్రపంచ కప్ ల తరహాలో టెస్టుల్లో ప్రపంచ చాంపియన్ షిప్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులోనూ భారత్-పాక్ ముఖాముఖి మ్యాచ్ లు లేవు. అయితే, ఈ రెండు జట్లు ఫైనల్ చేరితే మాత్రం టెస్టు మ్యాచ్ లో తలపడే చాన్సుంది. కానీ, పాకిస్థాన్ టెస్టుల్లో ఈస్థాయిలో లేదు.
2025-27 ప్రపంచ చాంపియన్ షిప్ వచ్చే జూన్ నుంచి మొదలు కానుంది. భారత్ ఎలాగూ ఫైనల్ వరకు రాగలదు. పాకిస్థాన్ కూడా అసాధారణంగా ఆడి ఫైనల్ కు వస్తే రోహిత్, కోహ్లి, జడేజాలు ఆ జట్టుపై ఏకైక టెస్టు ఆడినట్లు అవుతుంది. కానీ ఆందుకు అవకాశాలు తక్కువే.