Begin typing your search above and press return to search.

నాడు బీసీసీఐ నిషేధించినే ప్లేయరే.. నేడు నయా ఫినిషర్

రింకూ సింగ్.. టీమిండియాకు టి20ల్లో దొరికిన నయా ఫినిషర్. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా అత్యంత ఒత్తిడిలోనూ నిబ్బరంగా ఆడుతూ సిక్సర్లు కొట్టగలగడం అతడి సత్తా.

By:  Tupaki Desk   |   2 Dec 2023 12:27 PM GMT
నాడు బీసీసీఐ నిషేధించినే ప్లేయరే.. నేడు నయా ఫినిషర్
X

ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్ లో అత్యంత నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది ఎవరు..? జట్టుకు ఊహించని విధంగా స్కోరును అందిస్తున్నది ఎవరు..? ఒత్తిడిలోనూ నిలిచి పరుగులు చేస్తున్నది ఎవరు..? అంటే దీనికి సమాధానం ఓపెనర్లు యశస్వి జైశ్వాల్.. రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. హైదరాబాదీ తిలక్ వర్మ.. అని అందరూ భావిస్తారు. కానీ, వీరెవరూ కాకుండా ఒక ఆటగాడున్నాడని మాత్రం తొందరగా చెప్పలేకపోవచ్చు.

నాలుగేళ్ల కిందట అనామకుడు

రింకూ సింగ్.. టీమిండియాకు టి20ల్లో దొరికిన నయా ఫినిషర్. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా అత్యంత ఒత్తిడిలోనూ నిబ్బరంగా ఆడుతూ సిక్సర్లు కొట్టగలగడం అతడి సత్తా. ప్రస్తుతం జరుగుతున్న టి20 సిరీస్ లో దీనిని మరోసారి నిరూపించాడు. అయితే, రింకూ వెలుగులోకి వచ్చింది రెండు ఐపీల్ సీజన్ల కిందటనే. గతంలో అతడు అనామకుడు. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో సాధారణ కుటుంబంలో జన్మించాడు. కానీ, క్రికెట్ పట్ల అతడికి ఉన్న ప్యాషన్ రింకూను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసింది.

తెలియక ఆడి నిషేధం బారినపడి..

రింకూ సింగ్ నాలుగేళ్ల కిందట బీసీసీఐ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. మూడు నెలల పాటు అతడిపై బ్యాన్ విధించింది బీసీసీఐ. అది ఎందుకంటే.. అబుదాబీలో టి20 టోర్నమెంట్ ఆడేందుకు బోర్డు అనుమతి లేకుండా వెళ్లినందుకు. అప్పటికి రింకూకు కేవలం 22 ఏళ్లు. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ, తెలియక చేసిన ఈ తప్పునకు అతడు శిక్ష ఎదుర్కొన్నాడు. భవిష్యత్ పై తీవ్ర నిరాశకు గురయ్యాడు. వాస్తవానికి బీసీసీఐ ప్రపంచంలోనే ఉత్తమ విధానాలను పాటించాలని చూస్తుంటుంది. ఇలాంటివి చిన్న పట్టణాల నుంచి ఆటగాళ్లకు తెలియవు. అలా రింకూ పొరపాటు చేశాడు. కానీ, బ్యాన్ రింకూను ప్రభావితం చేయలేదు. ఉత్తర ప్రదేశ్ అండర్-19కు ఆడుతున్న సమయంలోనే అతడు కుటుంబానికి ఉన్న రూ.5 లక్షల అప్పు తీర్చేశాడు.

మొదటిసారి విమానం బిజినెస్ క్లాస్

అలీగఢ్ నుంచి వచ్చిన రింకూ ఐపీఎల్ లో విమాన ప్రయాణాలు చేసినప్పటికీ.. బిజినెస్ క్లాస్ లో ప్రయాణించలేదు. అలాంటిది జూన్ లో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు మొదటిసారిగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించాడు. కాగా, కోల్‌ కతా నైట్‌ రైడర్స్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌ లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి రింకూ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ లో రెండో మ్యాచ్ ఇన్నింగ్స్ చివరి దశలో 344.44 స్ట్రైక్ రేట్‌తో రింకూ చెలరేగి ఆడాడు. తొమ్మిదే బంతుల్లో 31 పరుగులు చేశాడు. దేశవాళీ టి20 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో యూపీ తరఫున ఏడు ఇన్నింగ్స్‌లలో 170.66 స్ట్రైక్ రేట్‌తో 256 పరుగులు చేశాడు. నవంబరు 27 వరకు రింకూ ఏడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా, సగటు 128 కావడం విశేషం. స్ట్రయిక్ రేట్ అయితే ఏకంగా 216 కావడం విశేషం