Begin typing your search above and press return to search.

బీసీసీఐ కాంట్రాక్టులు.. తెలుగోళ్లకు చాన్స్.. ఆ ఇద్దరి రీ ఎంట్రీ

ఇటీవలి కాలంలో అదరగొడుతున్న తెలుగు కుర్రాళ్లకు గుర్తింపుతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను వెల్లడించింది.

By:  Tupaki Desk   |   21 April 2025 7:29 AM
బీసీసీఐ కాంట్రాక్టులు.. తెలుగోళ్లకు చాన్స్.. ఆ ఇద్దరి రీ ఎంట్రీ
X

దేశవాళీ క్రికెట్ ఆడమంటే.. కారణాలు చెప్పి తప్పించుకున్న ఇద్దరు ఆటగాళ్లకు మళ్లీ పిలుపు.. ఇటీవలి కాలంలో అదరగొడుతున్న తెలుగు కుర్రాళ్లకు గుర్తింపుతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను వెల్లడించింది. కొంతకాలంగా ఈ కాంట్రాక్టుల వివరాల కోసం ఎదురుచూస్తుండగా.. తాజాగా వెలువడ్డాయి. మొత్తం 34 మంది క్రికెటర్లను ఎంపిక చేసింది. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న వారిని మాత్రమే ఏ ప్లస్ కేటగిరీకి పరిగణించే విధానాన్ని ఈసారి పక్కనపెట్టింది.


2024-25 సంవత్సరానికి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో కొత్తగా వచ్చినవారూ ఉన్నారు. ఇక నిరుడు కాంట్రాక్టులు కోల్పోయిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లను ఈసారి కరుణించింది.

మొత్తం కాంట్రాక్టుల్లో టాప్ గా చెప్పుకొనే, ఏటా రూ.7 కోట్ల వేతనం ఇచ్చే ఏ ప్లస్ లో నలుగురు.. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. బుమ్రా తప్ప మిగతా ముగ్గురూ అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికారు. అయినా వీరిని ఏ ప్లస్ ఉంచింది.

ఇక ఆరుగురితో ఎ గ్రేడ్ ను ప్రకటించింది. ఇందులో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. వాస్తవానికి సిరాజ్ ను ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. కాస్త పక్కనపెట్టినట్లు అనిపించినా.. అతడికి ఎ ప్లస్ కేటగిరీ ఇచ్చింది. బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, శుభ్‌ మన్ గిల్,ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా,పేసర్ మహ్మద్ షమీ, వికెట్ కీపర్ బ్యార్ రిషబ్ పంత్ కూడా ఉన్నారు. ఈ జాబితాలోని వారికి రూ.5 కోట్ల ఇస్తుంది.

టి20ల్లో టీమ్ ఇండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌ తో పాటు స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్,యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ బి గ్రూప్ లో ఉన్నారు. వీరికి రూ.3 కోట్ల వేతనం వస్తుంది.

ఇక ఏడాదికి రూ.కోటి దక్కే సి గ్రేడ్ కాంట్రాక్టులో ఎక్కువ శాతం టి20 ప్లేయర్లే ఉన్నారు. తెలుగు కుర్రాడు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఈ జాబితాలో తొలిసారి చోటు దక్కింది. మరో తెలుగోడు తిలక్ వర్మతో పాటు రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్‌ దూబె, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్‌ కుమార్, సంజూ శాంసన్, అర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్‌ ఖాన్, ఇషాన్‌ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్‌ దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణాలకు చాన్సిచ్చింది.