Begin typing your search above and press return to search.

మాజీ కెప్టెన్ పేరు మార్పు.. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో మరో లొల్లి

భారత క్రికెట్ లో ఒక దశలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన హైదరాబాదీ మొహమ్మద్ అజహరుద్దీన్ హెచ్ సీఏ కు అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

By:  Tupaki Desk   |   20 April 2025 4:30 PM
మాజీ కెప్టెన్ పేరు మార్పు.. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో మరో లొల్లి
X

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అంటే ప్రతిభతో పాటు అనేక ఆరోపణలు.. ప్రతిభావంతులను తొక్కేస్తుందని.. పైరవీలదే రాజ్యం అని.. అవినీతికి కేంద్రం అని.. ఇలా ఎన్నో.. హెచ్ సీఏ అధ్యక్ష పీఠం అంటే ఇక ముళ్ల కిరీటమే.. తాజాగా అసోసియేషన్ ను మరో లొల్లి చుట్టిముట్టింది..

భారత క్రికెట్ లో ఒక దశలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన హైదరాబాదీ మొహమ్మద్ అజహరుద్దీన్ హెచ్ సీఏ కు అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. టీమ్ ఇండియాకు 15 ఏళ్లకు పైగా ఆడిన అజహర్.. దాదాపు పదేళ్ల పాటు కెప్టెన్ గానూ ఉన్నారు. వరుసగా మూడు వన్డే ప్రపంచ కప్ లలో సారథ్యం వహించారు.

ఇక 2000 సంవత్సరంలో వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్ కెరీర్ ఆగిపోయింది. అప్పటికి 99 టెస్టులాడిన ఆయన ప్రతి క్రికెటర్ కు కల అయిన వందో టెస్టును పూర్తి చేయలేకపోయారు. దాదాపు 12-13 ఏళ్లు నిషేధం ఎదుర్కొన్నారు. 2013 తర్వాత క్రికెట్ లో మళ్లీ భాగమయ్యారు. 2009లో యూపీలోని మొరాదాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. గత తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అజహర్.. తాను పుట్టి పెరిగిన హైదరాబాద్ లోని, తాను క్రికెటర్ గా ఎదిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)కు అధ్యక్షుడిగానూ పనిచేశారు. అయితే ఆ సమయంలో ఉప్పల్ మైదానంలోని ఓ స్టాండ్ కు ఆయన తన పేరును పెట్టుకున్నారు. అది కూడా మరో హైదరాబాదీ మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు తొలగించి కావడం గమనార్హం.ఇక అజహర్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక హెచ్ సీఏకు జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయ్యారు.

స్టాండ్ కు తన పేరు పెట్టుకుంటూ అజహర్ 2019లో తీసుకున్న నిర్ణయంపై తాజాగా చర్యలు చేపట్టారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో నార్త స్టాండ్ కు అజహర్ పేరు ఉండగా దానిని తొలగించారు. హెచ్ సీఏ వివాదంలో కోర్టు నియమించిన అంబుడ్స్ మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. మ్యాచ్ టికెట్లపైనా అజహర్ స్టాండ్ పేరు ఉండకూడదని పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ టికెట్లకు సంబంధించి హైదరాబాద్‌ క్రికెట్ సంఘంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ వెళ్లిపోతామని బెదిరించింది. తాజాగా అజహరుద్దీన్ వివాదం తలెత్తింది.

స్టాండ్ కు తన పేరు తీసేయడంపై అజహర్ స్పందించారు. తాను

హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. హెచ్ సీఏ తీరు చూసి ప్రపంచం నవ్వుతోంది అని అన్నారు. కెప్టెన్ గా ఉన్న కాలంలో భారత్ కు 70 శాతం విజయాలు అందించిన తనను ఇలాగేనా గౌరవించేంది అని నిలదీశారు.

కొసమెరుపు: 1996లో వీవీఎస్ లక్ష్మణ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో కెప్టెన్ అజహర్.