Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఊహించినట్టే గుజరాత్, హిమాచల్‌ ఫలితాలు!

By:  Tupaki Desk   |   8 Dec 2022 5:29 AM GMT
షాకింగ్‌.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఊహించినట్టే గుజరాత్, హిమాచల్‌ ఫలితాలు!
X
గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఊహించినట్టే వస్తున్నాయి. గుజరాత్‌లో బీజేపీకి అధికారం వస్తుందని అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. అదేవిధంగా గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. 182 సీట్లు ఉన్న గుజరాత్‌ అసెంబ్లీలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో ఉంది. ఈ వార్త రాసే సమయానికి 152 సీట్ల ఆధిక్యంలో బీజేపీ దూసుకుపోతోంది. కాంగ్రెస్‌ పార్టీ 18, ఆప్‌ 8 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గుజరాత్‌ సీఎం భూపేందర్‌ భాయ్‌ పటేల్‌ 23 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గుజరాత్‌లోని గట్లోదియా స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పాటీ దార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ విరంగాం స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు.గాంధీనగర్‌ దక్షిణంలో పోటీ చేసిన ఆల్ఫేష్‌ ఠాకూర్‌ (బీజేపీ) కూడా ముందంజలో ఉన్నారు.

కాగా బీజేపీ తరఫున గుజరాత్‌లోని జామ్‌నగర్‌ బరిలో నిలిచిన స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా మూడో స్థానానికి పడిపోయారు. ఖంబాలియా స్థానంలో గుజరాత్‌ ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదాస్‌ గధ్వి లీడింగ్‌లో ఉన్నారు.

మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎగ్జిట్‌పోల్స్‌ భిన్నమైన ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. కొన్ని సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించగా, మరికొన్ని కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టాయి. అన్ని సంస్థలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బొటాబొటీ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రకటించాయి. కొన్ని సంస్థలు హంగ్‌ అసెంబ్లీకి కూడా ఆస్కారం ఉందని ప్రకటించాయి.

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలకనుగుణంగానే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వస్తుండటం గమనార్హం. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 35 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి 33 చోట్ల ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ 31 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో హిమాచల్‌లో పోటీ పడుతున్నాయి.

కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నో ఉచిత పథకాల హామీలతో ముందుకొచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర ఓటర్లు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. మొత్తం 68 సీట్లలో ఒక్క చోట కూడా ఆప్‌ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

బీజేపీ 33 చోట్ల, కాంగ్రెస్‌ 31 చోట్ల ఆధిక్యంలో ఉండగా ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో రెబల్స్, ఇండిపెండెంట్ల పైన ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్‌ ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో బేరసారాలకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు అప్రమత్తమయ్యాయి. అప్పుడే రిసార్ట్స్‌ రాజకీయాలకు తెరలేపుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.