Begin typing your search above and press return to search.

15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ?

By:  Tupaki Desk   |   7 July 2016 10:15 AM GMT
15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ?
X
ఏపీలో ఫిరాయింపుల వేడి చల్లారిందనుకున్న దశలో మరోసారి ఆ సెగ మొదలైనట్లుగా కనిపిస్తోంది. కొద్దికాలంగా వైసీపీ నుంచి టీడీపీలోకి పిరాయింపులు జోరందుకుని, ఆ తరువాత ఆగిపోయాయి. అయితే.. అది తాత్కాలికమేనని.. మళ్లీ జంపింగులు మొదలవుతాయని అంటున్నారు. మరో 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేస్తారని ఇటీవల టీడీపీలో చేరిన పటమట ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఇప్పటికే జంప్ చేసిన ఎమ్మెల్యేలు కాకుండా మరో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు.

అయితే... ఇంతకుముందు కూడా మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని అనుకున్నా అది ఆగిపోయింది. ఆలోగా రాజ్యసభ ఎన్నికలు కూడా పూర్తికావడంతో ఇక ఫిరాయింపులు ఉండకపోవచ్చని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా జలీల్ ఖాన్ చేసిన ప్రకటన మళ్లీ వైసీపీలో ఇప్పుడు కలవరం రేపుతోంది. త్వరలోనే సదరు 15 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారని ఆయన పేర్కొనడంతో చాలామంది వైసీపీ నేతలపై అనుమానపు చూపులు పడుతున్నాయి.

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆరోపించిన జలీల్ ఖాన్... మైనారిటీల సంక్షేమానికి టీడీపీ మాత్రమే కృషి చేస్తోందని అన్నారు. రంజాన్ సందర్భంగా ప్రార్థనల అనంతరం మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అతిశయోక్తులు చెప్పే జలీల్ మాటలన్నీ ఉత్తవేనని వైసీపీ నేతలు అంటున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం తప్ప నిజాలు మాట్లాడడం ఆయనకు అలవాటు లేదని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.