Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ పాలిటిక్స్‌!... కొత్త స‌త్తా వైసీపీదే!

By:  Tupaki Desk   |   31 March 2019 11:37 AM GMT
నేష‌న‌ల్ పాలిటిక్స్‌!... కొత్త స‌త్తా వైసీపీదే!
X
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చే అవ‌కాశాలే లేవ‌న్న‌ది దాదాపుగా అన్ని స‌ర్వేలూ చెబుతున్న‌దే. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని ఆలోచించినా... ఈ మాట‌లో స‌త్యదూర‌మైన విష‌య‌మేమీ లేద‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు ప‌నిచేయ‌డంలో మోదీ విఫ‌ల‌మైపోతే... అధికార ప‌క్షాన్ని గ‌ల్లా ప‌ట్టుకుని రోడ్డు మీద‌కు ఈడ్చుకురావడంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఇటు బీజేపీతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించే అవ‌కాశాలే లేవ‌న్న‌ది స‌ర్వేల మాట‌గా వినిపిస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం జ‌రుగుతుంది? త‌మ త‌మ సొంత రాష్ట్రాల్లో స‌త్తా చాటే ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు తీసుకునే పార్టీనే కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లుగుతుంది. అలాంటి స‌త్తా క‌లిగిన పార్టీలు ఏవి? గ‌తంలో చాలానే ఉండేవి? ఇప్పుడూ చాలానే ఉన్నాయి. అయితే వాటిలోకి ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన చేరిన వైసీపీ స‌త్తా చాటే పార్టీగా అన్ని స‌ర్వేలు చెబుతున్నాయి.

25 ఎంపీ సీట్లు క‌లిగిన ఏపీలో విప‌క్షంగా ఉన్న వైసీపీ... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల్లో పురుడుపోసుకుంది. ఇటీవ‌లే తొమ్మిదో వ‌సంతం పూర్తి చేసుకున్న ఈ పార్టీ ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విన్న‌ర్‌గా నిలిచే అవ‌కాశాలున్న‌ట్లు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో స్ప‌ష్ట‌మైన మెజారిటీతోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ద‌ని భావిస్తున్న వైసీపీ... 25 అసెంబ్లీ సీట్ల‌లో 20కి పైగా సీట్ల‌లో విజ‌యకేత‌నం ఎగుర‌వేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టిదాకా విడుద‌లైన దాదాపుగా అన్ని స‌ర్వేలు ఇదే మాట‌ను చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి విడుద‌లైన మరో స‌ర్వే కూడా ఇదే విష‌యాన్ని చెప్పింది. వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో వైసీపీ ఏకంగా 20కి పైగా ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని తేలింది. అంతేకాదండోయ్‌... ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర అంశం కూడా ఉంది.

దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీల జాబితాను త‌నదైన అంచ‌నా మేర‌కు విడుద‌ల చేసిన వీడీపీ అసోసియేట్స్‌... వైసీపీని థ‌ర్డ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో వైసీపీతో పాటు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు స‌మాజ్ వాదీ పార్టీ కూడా ఉన్నాయి. ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ గానీ, తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ గానీ ఈ జాబితాలో చోటు ద‌క్కించుకోలేక‌పోయాయి. టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉండ‌గా.... 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణ‌లోని అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఫోర్త్ సింగిల్ లార్జెస్ట్ పార్టీల జాబితాలో చోటు ద‌క్కించుకుంది. ఈ జాబితాలో టీఆర్ఎస్‌తో పాటు బీఎస్పీ, డీఎంకే, అన్నాడీఎంకే, శివ‌సేన‌లు ఉన్నాయి. ఈ అన్ని పార్టీల ప్ర‌స్తావ‌న బాగానే ఉన్నా... ఈ మొత్తం స‌ర్వేలో వైసీపీనే ఆసక్తి క‌లిగిస్తోంది. ఎందుకంటే... ఏపీలో అధికార పార్టీగా అవ‌త‌రిస్తుంద‌న్న అంచ‌నాల‌తో పాటు జాతీయ రాజ‌కీయాల్లోనూ కీల‌క భూమిక పోషించే పార్టీ వైసీపీ కొత్త బాధ్య‌త‌ల‌ను కూడా చేప‌ట్ట‌నుంద‌ట‌.