Begin typing your search above and press return to search.

క‌డ‌ప జిల్లాలో వైకాపా వెర్స‌స్ వైకాపా.. తీవ్ర ఘ‌ర్ష‌ణ‌

By:  Tupaki Desk   |   28 May 2020 5:00 AM GMT
క‌డ‌ప జిల్లాలో వైకాపా వెర్స‌స్ వైకాపా.. తీవ్ర ఘ‌ర్ష‌ణ‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త విభేదాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. మొన్న‌టిదాకా ప్ర‌త్య‌ర్థుల్ని ఎటాక్ చేస్తూ వ‌చ్చిన వైకాపా వాళ్ళు ఇప్పుడు వాళ్ల‌లో వాళ్లు కొట్టుకుంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏడాది పాల‌న పూర్తి చేసుకుంటున్న శుభ సంద‌ర్భంలో ఇలాంటి వ్య‌వ‌హారాలు రోజుకొకటి బ‌య‌ట‌ ప‌డుతున్నాయి. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నగరి ఎమ్మెల్యే రోజా మాటల యుద్ధం మరువక ముందే.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో వైపాకా ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌కర్త‌లు నడి రోడ్డుపై తీవ్ర స్థాయిలో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు.

బద్వేలు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకోవ‌డంతో స్థానిక నేత‌లు రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చూస్తుండగానే ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. కడప జిల్లా బి.కోడూరు మండలంలోని పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసేందుకు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఓ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ గొడవ చెలరేగింది. ఆ వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రామకృష్ణారెడ్డి, యోగానంద్‌రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయ పడ్డారు. ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. మాటవినని వారిపై లాఠీ ఝుళిపించారు. గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థుల స‌మాచారం మేర‌కు పోలీసులు రంగంలోకి దిగ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.