Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే డబ్బులు బాబువే..రాజీనామాలకు సిద్ధం

By:  Tupaki Desk   |   15 Feb 2018 1:23 PM GMT
ఆ ఎమ్మెల్యే డబ్బులు బాబువే..రాజీనామాలకు సిద్ధం
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు మండిప‌డ్డారు. బాబు తీరు స్వార్థ రాజకీయాల‌కు ప‌రాకాష్ట‌గా ఉంద‌ని పేర్కొన్నారు. పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి - ఎమ్మెల్యే ఆర్కే రోజా వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరును తీవ్రంగా ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది ఢిల్లీ అహంకారానికి.. ఆంధ్రా ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరు అని అన్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌ లో రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకునేందుకు పోరాడతామని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలొస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని టీడీపీ వాళ్లు ప్రచారం చేసుకోవడం చూస్తుంటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూన్‌ 5 వరకు మేము ఎంపీలుగా కొనసాగే అర్హత ఉందన్నారు. మేము 14 నెలలు ముందే రాజీనామాలు చేస్తున్నామని.. సుదీర్ఘ అనుభవం - దేశవ్యాప్తంగా పరిచయాలున్న చంద్రబాబు తమ రాజీనామాలను ఆమోదింపజేయాలని సవాల్‌ విసిరారు.

పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని వైఎస్‌ ఆర్‌ సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజల మద్ధతుతో గెలిచి ప్రత్యేక హోదా అవసరాన్ని దేశానికి తెలియజేస్తామని చెప్పారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాను టీడీపీ మేనిఫెస్టోలో మొదటి పాయింట్‌ గా చేర్చుకుని...ఎవరి అంగీకారంతో ప్యాకేజీకి ఆమోదం తెలిపారో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. `గతేడాది విశాఖలో జరిగిన పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ లో 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు.. డీఐపీపీ లెక్కల ప్రకారం అంతా ఉత్తదేనని తేలింది. రాజధానిలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి అడుగుకు పదివేలు ఖర్చు చేయడం చూస్తుంటేనే భారీ అవినీతి జరిగిందని తెలుస్తోంది. గుజరాత్‌ లో రెండు రూపాయలకు విండ్‌ పవర్ యూనిట్‌ కు ఖర్చు చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం రూ. 4 ఖర్చు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేవలం కాంట్రాక్టులు - కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపారని తేటతెల్లం అవుతోంది` అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టి 17 రోజులవుతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని మిథున్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ ఆర్‌ సీపీ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఆరోపణలకు చంద్రబాబు జవాబు చెప్పి తీరాలి. ఎక్కడ దాక్కున్నా ఇప్పటికైనా చంద్రబాబు బయటకొచ్చి సమాధానం చెప్పాలి. లేదంటే.. ఆనాడు కాంగ్రెస్‌ కు పట్టిన గతే ఇప్పుడు టీడీపీ పడుతుందని హెచ్చరించారు.

ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాల గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడారు. వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్‌ జగన్‌ బ్రహ్మాస్త్రం వదిలితే టీడీపీ నేతలకు మైండ్‌ బ్లాక్‌ అయి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పేల్చుతున్నారని - నీకు దమ్ము - ధైర్యం ఉంటే మీ జిల్లాలోనే వైఎస్‌ జగన్‌ ఉన్నారని - మీ పాలనలో ఏం చేశారో వచ్చి చెప్పాలన్నారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దమ్మున్న నాయకుడని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.`ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగలు మీరు. జైలుకు పోతామని భయంతో చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోవడం, కేసీఆర్‌ కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుకే అలవాటు. వైఎస్‌ జగన్‌ సింహం..కేంద్రానికి భయపడే వ్యక్తి కాదు` అని అన్నారు. నారాయణ కళాశాలలో ఆడపిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే మంత్రి గంటా శ్రీనివాసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు స్పందించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌న్నారు. ప్రతి మహిళా వైయస్‌ జగన్‌ కు మద్దతుగా నిలవాలని రోజా పిలుపునిచ్చారు.

ప్ర‌త్యేక హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని ఎమ్మెల్యే రోజా కొనియాడారు. చివరి అస్త్రంగా మా ఎంపీలతో రాజీనామా చేస్తామని ఇచ్చిన మాటను మరోసారి నిలబెట్టుకున్న నేత వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనతో మనల్ని మోసం చేసి, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరారు. ఏ రాష్ట్రానికి చేయని విధంగా మోడీ మన రాష్ట్రానికి గొప్పగా సాయం చేశారని చంద్రబాబు గత నెలలోనే చెప్పారన్నారు. ఆ డబ్బులన్నీ ఏం చేశావు బాబూ? అని అడిగారు. కేంద్ర బడ్జెట్‌ లో ఏపీకి అన్యాయం జరిగితే చంద్రబాబు తేలు కుట్టిన దొంగలాగా దాక్కొని తన అనుకూల మీడియాకు లీకులిస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రోజా మండిప‌డ్డారు. . చంద్రబాబు ఆరేళ్ల ఆడపిల్ల నుంచి 60 ఏళ్ల మహిళ వరకు ప్రతి ఒక్కరిని మోసం చేశారన్నారు. కడుపులో ఉన్న బిడ్డతో సహా ఆయన మోసం చేశారన్నారు. పండంటి బిడ్డ - మా ఇంటి మహాలక్ష్మీ అంటూ అందర్ని మోసం చేశారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చి ఈ రోజు మహిళలను రోడ్డుపైకి తెచ్చారన్నారు. ఆడపిల్లలకు సైకిల్‌ ఇస్తామని సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేయించుకొని పంగనామాలు పెట్టింది నిజం కాదా అన్నారు. మహిళలకు సెల్‌ ఫోన్లు ఇస్తామని మోసం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. ఈ రాష్ట్రంలో ఒక్క మహిళనైనా పారిశ్రామికవేత్తను చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన 600 హామీలను తుంగలో తొక్కారన్నారు. చంద్రబాబు అంతం..మహిళల పంతం అన్న నినాదంతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మనకు రక్షణ కలగాలంటే, సామాజికంగా ఎదగాలన్నా..సంక్షేమం అందాలంటే రాజన్న బిడ్డ వైఎస్‌ జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు. జగనన్న రావాలి..జగనన్న కావాలని అందరూ నినదించాలని రోజా పిలుపునిచ్చారు. చంద్రబాబు నాలుగేళ్లలో మహిళలకు చేసిన మోసాలను ప్రతి ఇంట్లో వివరించాలని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని రోజా కోరారు.