Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పోల‌వ‌రం జ‌ర్నీ గుట్టు విప్పిన రోజా!

By:  Tupaki Desk   |   8 Dec 2017 10:00 AM GMT
ప‌వ‌న్ పోల‌వ‌రం జ‌ర్నీ గుట్టు విప్పిన రోజా!
X
క‌నిపించేవి.. వినిపించేవ‌న్నీ నిజాలు కావు. రాజ‌కీయాల్లో ప్రాథ‌మికంగా చెప్పే మాట ఇది. అలాంటిది ఒక రాజ‌కీయ నేత చేసే ప‌నికి.. చెప్పే మాట‌లోనూ అంత‌ర్లీనంతో ఏదో లెక్క ప‌క్కా. కొద్ది నెల‌లుగా బ‌య‌ట‌కు రాని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌ట్లుండి బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. గ‌డిచిన మూడు రోజులుగా వివిధ అంశాలపై దృష్టి సారిస్తున్న ప‌వ‌న్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌ల్లెత్తు మాట అన‌క‌పోవ‌టం స‌రి క‌దా.. అనుభ‌వం ఉందంటూ కితాబులిచ్చే ప‌ని చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ది జ‌న‌సేన కాదు భ‌జ‌న‌సేన అంటూ నిప్పులు చెరిగిన ఆమె.. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న వెనుక ఉన్న గుట్టును విప్పే ప్ర‌య‌త్నం చేశారు. చంద్ర‌బాబుది త‌ల్లి టీడీపీ అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పిల్ల టీడీపీ అని ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ మాట‌ల‌కు.. చేత‌ల‌కు సంబంధం ఉండ‌ద‌న్న రోజా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎప్పుడు అవినీతిలో ఇరుక్కున్నా వెంట‌నే రంగంలోకి దిగే ప‌వ‌న్‌.. ఇష్యూను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తార‌న్నారు.

పోల‌వ‌రం అవినీతిలో కూరుకుపోగానే రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని తెర మీద‌కు తెచ్చి నాట‌కాలు ఆడుతున్న బాబు.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తెర మీద‌కు తీసుకొచ్చి హైడ్రామా మొద‌లెట్టార‌న్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శిస్తుంద‌న్న విష‌యం తెలిసిన వెంట‌నే.. ప‌చ్చ ఛాన‌ళ్లు.. చంద్ర‌బాబు క‌లిసి హ‌డావుడిగా ప‌వ‌న్‌ ను పోల‌వ‌రం పంపాయ‌ని విమ‌ర్శించారు.

దేన్నైనా ప్ర‌శ్నిస్తా.. దేనినైనా నిల‌దీస్తాన‌ని చెప్పే ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌.. పుష్క‌రాల స‌మ‌యంలో 29 మంది అమాయ‌కులు మ‌ర‌ణించిన‌ప్పుడు ఎక్క‌డ ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. అనుభ‌వం లేని వ్య‌క్తి ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌ని ప‌వ‌న్ అంటున్నార‌ని.. మ‌రి ఎలాంటి అనుభ‌వం కావాల‌న్న రోజా.. "పిల్ల‌నిచ్చిన మామ‌పై చెప్పులు విసిరి.. వెన్నుపోటు పొడిచి సీఎం కావొచ్చా? ఏ అర్హ‌త లేకున్నా ఎమ్మెల్యేగా గెల‌వ‌ని వ్య‌క్తిని ఎమ్మెల్సీ చేసి మంత్రి ప‌ద‌వి ఇవ్వొచ్చా? ఇలాంటి వాళ్ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌జ‌న చేయ‌టం ఏమిటి?" అంటూ సూటిగా నిల‌దీశారు.

ప్ర‌శ్నించ‌టం కోస‌మే తాను పార్టీ పెట్టిన‌ట్లుగా చెప్పే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు వింటే ఆశ్చ‌ర్యంగా ఉంటాయ‌న్నారు. వాస్త‌వానికి ప‌వ‌న్ ఉన్న‌ది ప్ర‌శ్నించ‌టానికి కాద‌ని.. ప్యాకేజీల కోస‌మంటూ ఎద్దేవా చేసిన రోజా.. షూటింగ్ గ్యాప్ ల‌లో బ‌య‌ట‌కు వ‌చ్చి ఇత‌రుల‌పై నింద‌లు వేయ‌టం స‌రికాద‌న్నారు. చేత‌నైతే ప్ర‌జ‌ల్లో ఉండి పోరాడాల‌న్న రోజా.. ప‌వ‌ర్ లేకున్నా ఏమైనా చేయొచ్చ‌ని ప‌వ‌న్ అంటుంటార‌ని.. అదే నిజ‌మైతే రైతుల ఇబ్బందులు తీర్చేందుకు రుణ‌మాఫీ చేసేయొచ్చుగా అని దుయ్య‌బ‌ట్టారు.