Begin typing your search above and press return to search.

బాబు ఇప్పుడు శ్వేత‌ప‌త్రం ఇచ్చే ద‌మ్ముందా?

By:  Tupaki Desk   |   11 Oct 2017 4:29 PM GMT
బాబు ఇప్పుడు శ్వేత‌ప‌త్రం ఇచ్చే ద‌మ్ముందా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు దగా చేసిన కార‌ణంగా...రాష్ట్రం సంక్షోభంలో ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు - తన జల్సాల కోసం - తనకు కావాల్సిన వారి కోసం దోచిపెట్టేందుకు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టుతున్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాంటి బృహ‌త్త‌ర ల‌క్ష్యంతో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాద‌యాత్ర‌కు సిద్ధ‌ప‌డ్డార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల కోసం పాద‌యాత్ర‌కు సిద్ధ‌ప‌డ్డ పోరాట యోధుడు వైఎస్ జ‌గ‌న్ అని రోజా అన్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాదయాత్రపై బుధవారం నిర్వహించిన సమావేశం అనంతరం ఆ వివరాలను ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి - అంబటి రాంబాబు - ఎమ్మెల్యే రోజా ఈ సంద‌ర్భంగా మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. పాదయాత్ర అన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ల్యాండ్‌ మార్క్‌ అన్నారు. మహానేత బాటలో వైఎస్‌ జగన్‌ నవంబర్‌ 2న పాదయాత్రకు స్వీకారం చుట్టారన్నారు. ఆరు నెలలు ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ఏ విధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్న అంశాలపై చర్చించేందుకు ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో దాదాపు 50 మంది తమ సలహాలు - సూచనలు ఇచ్చారని తెలిపారు. వాటన్నింటిని కూడా వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నోటు చేసుకున్నారని పార్టీ నేత‌లు మేక‌పాటి - అంబ‌టి - ఆర్కే రోజా తెలిపారు.

రాష్ట్రంలోని రైతులు 90 శాతం అప్పుల్లో కూరుకుపోయారని - నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైసీపీ నేత‌లు ఆక్షేపించారు. అలాంటి వారంద‌రికీ చేరువ అయ్యి తానున్నా భ‌రోసా ఇచ్చేందుకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా, పోరాట యోధుడిగా ఈ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ - స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసే సమయంలో ప్రతి మనిషిని పలకరించి - వారి కష్టాన్ని తెలుసుకున్నారు కాబట్టే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ - ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వంటి పథకాలను పక్కా రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయంటే ఆ ఘనత వైఎస్‌ ఆర్‌ దే అన్నారు. మహానేత మాదిరిగానే వైఎస్‌ జగన్‌ కూడా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3 వేల కిలోమీటర్లకు పైగా జరుగుతున్నా ఈ పాదయాత్ర దాదాపు 125 నియోజకవర్గాల్లో సాగుతుందన్నారు. మిగతా 50 నియోజకవర్గాలను పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర ద్వారా ఆ నియోజకవర్గాలను కూడా వైఎస్‌ జగన్‌ దర్శిస్తారని వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ చేపడుతున్న ఈ పాదయాత్రకు ప్రతి ఒక్కరు తమ మద్దతు తెలపాలని పార్టీ నేత‌లు కోరారు. టీడీపీకి బుద్ధి చెప్పే విధంగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర జరుగుతుందని, ప్రజలకు భరోసా కల్పించేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏవిధంగా సువర్ణయుగాన్ని ఇచ్చారో వైఎస్‌ జగన్‌ కూడా తన తండ్రి పేరు 30 ఏళ్లు గుర్తు ఉండేలా , చక్కని పరిపాలన అందించే విధంగా ఈ పాదయాత్ర ఉంటుందని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ మంత్రుల తీరుపై ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వ‌హించిన యువభేరి కార్యక్రమం విజయవంతం కావడంతో టీడీపీ మంత్రులకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని తప్పుపట్టారు.ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కాబట్టే వైఎస్‌ జగన్‌ మూడున్నరేళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారని గుర్తు చేశారు. యువత చైతన్యవంతమై వైఎస్‌ జగన్‌ పోరాటాలకు మద్దతిస్తున్నారు కాబట్టే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ను తిట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని హితవు పలికారు. రాష్ట్రంలో అధికారంలో ఉండేది టీడీపీ, ప్రజలను మోసం చేస్తుంది చంద్రబాబు అన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మూ - ధైర్యం మీకుందా అని రోజా మంత్రులను సవాల్‌ చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబుకు ఈ రోజు అమ్మాయిలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టింది నిజం కాదా అని నిలదీశారు. ప్రత్యేక హోదా కన్న బ్రహ్మండమైన ప్యాకేజీ వచ్చిందని ఆరోజు అర్ధరాత్రి చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పారని, ఆ ప్యాకేజీ ఎంత వచ్చిందో ఈ రోజు శ్వేత పత్రం విడుదల చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ కూడా టీడీపీ సాధించలేకపోయిందని, వారి చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్‌ జగన్‌ పై బురద చల్లుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా కేంద్రం నుంచి కరువు భత్యం తీసుకురావడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపిస్తూ అక్కడి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు.