Begin typing your search above and press return to search.

మాజీ డిప్యూటీకి అంత ఈజీనా...?

By:  Tupaki Desk   |   26 April 2022 10:30 AM GMT
మాజీ డిప్యూటీకి అంత ఈజీనా...?
X
ఎపుడు ఎన్నికలు జరిగినా పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ విజయం ఖాయమని కొత్తగా వైసీపీ ప్రెసిడెంట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి గట్టిగానే చెప్పారు. ఆమె పదవీ ఉత్సాహంలో ఆ మాటలు అన్నారు. మంత్రి పదవి పోయిన తరువాత జగన్ గుర్తించి గౌరవించిన సీనియర్లతో పాటు ఆమె కూడా ఒకరు.

ఇక పార్టీ బాధ్యతలు అంటే చాలా ఉంటాయి. మంత్రిగా పుష్ప శ్రీవాణి ఏనాడు కురుపాం గడప దాటలేదని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. ఆమె నియోజకవర్గం అభివృద్ధి పనులను కూడా చేయించుకోలేకపోయారు అని కూడా అంటారు. ఆమె నియోజకవర్గంలో ఈ మధ్యనే ఒక బాలుర హాస్టల్ లో పాము కాటుకు గురై ఒక బాలుడు మరణించిన ఘటనను ఉదహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆమె పదవిని సీనియర్ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు ఇచ్చారు. ఇక రాజన్న దొర మంత్రిగా బిజీగా ఉంటారు. పైగా ఆయన నాలుగు సార్లు ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన మీద కనుక మోజు తగ్గితే సాలూరులో ఈసారి గెలుపు కోసం ఎదురీదాలి.

మరో వైపు పాలకొండలో కూడా రెండుసార్లు కళావంతి వైసీపీ ఎమ్మెల్యేగా చేశారు. ఆమె మీద కూడా వ్యతిరేకత ఉంది. పార్వ‌తీపురం లో చూసుకుంటే అలజంగి జోగారావు మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది అంటారు. కురుపాం లో ఉన్నది పుష్ప శ్రీవాణి. ఆమె మామ, చినమామ‌ సహా అత్తింటి వారి నుంచే గట్టి పోటీ ఉంది.

దాంతో మన్యం జిల్లాలో ఉన్న ఈ నాలుగు సీట్లలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కాలీ అంటే చాలా కష్టపడాలి. మరి పుష్ప శ్రీవాణి తనకు గుర్తింపు ఇచ్చిందని వైసీపీ అధినాయకత్వాన్ని మెచ్చడం కాకుండా ఇక మీదట జనాల్లో ఉండాలి. పార్టీ పటిష్టత కోసం అలుపెరగని తీరున పోరాడాలి.

ఇక అధికారం చేతిలో ఉన్న వేళ సరిగ్గా జనాల్లో ఆమె కనిపించలేదని విమర్శలు వచ్చిన క్రమంలో ఇపుడు పార్టీ ప్రెసిడెంట్ గా ఏ అధికార ఆర్భాటం లేకుండా వెళ్ళగలరా. వెళ్ళినా జనాల మద్దతు దక్కుతుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా డిప్యూటీ మీద అతి పెద్ద బాధ్యతనే మోపారు అంటున్నారు.