Begin typing your search above and press return to search.

అమరావతి షేప్ మారింది... వైసీపీ పంతం నెరవేరింది!

By:  Tupaki Desk   |   29 Oct 2022 10:55 AM GMT
అమరావతి షేప్ మారింది... వైసీపీ పంతం నెరవేరింది!
X
అమరావతి రాజధాని చుట్టూనే ఏపీ రాజకీయం గత మూడున్నరేళ్ళుగా గిర్రున తిరుగుతోంది. ఒక ప్రాంతం మీద రాజకీయాలు సాగడం అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయితే రాజకీయాల్లో సున్నితమైన అంశాలే ఎపుడూ హైలెట్ అవుతూంటాయి. అవే రాజకీయ మైలేజిని తెస్తాయి. పొలిటికల్ ప్రాఫిట్స్ ని కూడా తీసుకువస్తాయి. అందుకేనేమో టీడీపీ అమరావతి మీద వైసీపీ అస్త్రం మూడు రాజధానులు వేసింది.

ఇపుడు ఆ రచ్చ ఒక వైపు అలా సాగుతూండగానే అమరావతి రూపూ షేపూ ప్రస్తుతం ఉన్నట్లుగా ఉండకూడదన్నది వైసీపీ పంతం. తమకు అధికారాన్ని ప్రజలు కట్టబెట్టాక అక్కడ తాము అనుకుంటున్న సమూలమైన మార్పులు చేయాలని ఊడా వైసీపీ గట్టిగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అక్కడ పేదలకు ఇళ్ళ పట్టాలను ఇస్తూ గతంలో జీవో ఇచ్చింది. అయితే ఇది న్యాయ సమీక్షకు నిలబడలేదు. రైతులు కోర్టుకు వెళ్లడంతో అది ఆగింది.

ఇపుడు వైసీపీ మరో వైపు నుంచి ఈ వ్యవహారాన్ని నరుక్కుంటూ వచ్చింది. అమరావతి రాజధానికి కేంద్రమైన సీయార్డీయే చట్టాన్నే ఏకంగా సవరించింది, అసెంబ్లీలో దాని మీద తీర్మానం చేసి గవర్నర్ కి పంపించి ఆమోదముద్ర వేయించుకుంది. ఇలా మార్చిన సీయార్డీయే చట్టం మేరకు అమరావతి రాజధానికో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.

వైసీపీ మార్క్ తో స్పెషన్ జోన్ కి క్రియేట్ చేసింది. అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ళ కోసం ఆర్ 5 పేరుతో స్పేషన్ జోన్ ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జోనింగులో మార్పులు చేర్పుల మీద పదిహేను రోజుల వ్యవధిలో అభ్యంతరాలు సలహాలు చెప్పాలని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది.

మరో వైపు మార్చిన చట్టం ప్రకారం అమరావతి రాజధానిలో అర్హులైన పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు స్థానిక సంస్థలకు పెద్ద ఎత్తున అధికారాలు దఖలు పడ్డాయి. ఇదిలా ఉంటే అమరావతి రాజధాని ప్రకటన చేస్తూ కొంత భూమిని భవిష్యత్తు అవసరలకు గత ప్రభుత్వం ఉంచింది. ఇపుడు ఆ భూములలో పేదలకు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంటూ స్పెషల్ జోన్ ని క్రియేట్ చేసింది

దీని మీద ఏ మాత్రం కుదరదు అని 2020 మార్చిలో హై కోర్టు స్పష్టం చేసింది. అయితే హై కోర్టు చెప్పినా కూడా చట్ట సవరణ చేసి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని అంటున్నారు. ఆర్-5 జోన్ పేరిట అమరావతి రాజధానిలోని అయిదు గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తూ నోటిఫికేషన్ తాజాగా ఇవ్వడం మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సీయార్డీయే చట్టాని సవరించి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయడాన్ని కూడా విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉండగా సీయార్డీయే చట్ట సవరణ మీద కూడా అమరావతి రైతులు కోర్టుకు వెళ్లారు. అది విచారణ దశలో ఉండగా ఇపుడు నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఇది కోర్టు ధిక్కారమని అమరావతి రైతులు అంటున్నారు. అయితే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే తప్పేంటి అన్న వాదనతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఏకంగా యాభై వేల మంది పేదలను సమీప గ్రామాలలో గుర్తించి వారికి ఇళ్ల పట్టాలను ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

అయితే ఇక్కడే అమరావతి రైతులు లాజిక్ పాయింట్ ని లేవదీస్తున్నారు. మా ప్రమేయం లేకుండా ఈ మార్పులు ఎలా చేస్తారు అన్నది వారి కీలకమైన ప్రశ్న. రాజధాని కోసం ఇచ్చిన భూములలో అభివృద్ధి చేసి ముందుగా ప్లాట్స్ ఇవ్వాలని, తమకు ఇవ్వకుండా తామిచ్చిన భూములలో ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వడమేంటన్నది వారి ప్రశ్న. దీని మీద రైతులు ఏం చేస్తారో కానీ ఇది వివాదం అయ్యేటట్లుగానే ఉంది అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.