Begin typing your search above and press return to search.

బొత్స ప్ర‌శ్న‌కు టీడీపీ చెప్పే స‌మాధానం ఏంటో?

By:  Tupaki Desk   |   4 July 2018 2:00 PM GMT
బొత్స ప్ర‌శ్న‌కు టీడీపీ చెప్పే స‌మాధానం ఏంటో?
X
ఓ వైపు ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం..మ‌రోవైపు ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అధికార తెలుగుదేశం పార్టీలో క‌ల్లోలం మొద‌లైంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో నాలుగేళ్ల బీజేపీ దోస్తీ వ‌ల్ల క‌లిగిన న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు ఆ పార్టీ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అలాంటి ప్ర‌య‌త్నాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ అంశాల‌తో దీక్ష చేయ‌డం ఒక‌టి. తాజాగా రైల్వే జోన్ కోసం విశాఖలో టీడీపీ ప్రజాప్రతినిధులు దీక్ష చేప‌ట్టారు. ఎప్ప‌ట్లాగే ఈ దీక్ష‌కు అనంత‌పురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హాజ‌రై త‌న‌దైన శైలిలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఓ సీనియ‌ర్ నాయ‌కుడు మాట్లాడాల్సిన తీరు ఇదేనా అనే సందేహం క‌లిగే రీతిలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. దీనిపై వైఎస్ ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ సైతం మండిప‌డ్డారు. టీడీపీ నేతలు సభ్యత - సంస్కారాన్ని మరచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మనిషా? పశువా? అని మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నాయకుల వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ ఖండించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మీడియాతో మాట్లాడుతూ...రైల్వే జోన్ - కడప స్టీల్‌ ఫ్యాక్టరీ - దుగ్గరాజపట్నం పోర్టును ఆరు నెలల్లో పరిశీలించి, ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే పొందుపరిచారన్నారు. ఆరు నెలల సమయంలో సాధ్యాసాధ్యాలు గుర్తించాలని చట్టంలో పెడితే..నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి కాపురం చేసి ఏం ఒరగబెట్టారని సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు ఇవాళ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ అవినీతి కార్యక్రమాల కోసం కాలయాపన చేసి..ఇవాళ దీక్షలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్‌ కావాలని వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌ నాథ్‌ జిల్లావ్యాప్తంగా పాదయాత్ర చేశారన్నారు. మేం ఉద్యమిస్తే..ఆనాడు టీడీపీ ప్రభుత్వం హేళన చేసిందని - దీక్షల పట్ల చులకనగా మాట్లాడారని - ఉద్యమించిన వారిపై కేసులు పెట్టారన్నారు. ఉక్కులేదు..తుక్కు లేదని మాట్లాడిన నాయకులు ఏం ముఖం పెట్టుకొని విశాఖలో ఇవాళ దీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు నిజంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై చిత్త‌శుద్ధి లేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. టీడీపీ నాయకులు మొదట రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. టీడీపీ నేత‌ల‌కు ద‌మ్ముంటే ఢిల్లీలో ప్రధాని మోడీ ఇంటి ముందు - రైల్వే మంత్రి ఇంటి వద్ద ధర్నాలు చేయాలని సవాల్‌ విసిరారు. ఎంపీలుగా కొనసాగుతున్న పెద్ద మనుషులు విశాఖలో ఏం చేస్తారని - ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాలని సూచించారు. ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎంపీలు ఇటీవల ఎంత అసహ్యంగా - జుగుప్సాకరంగా మాట్లాడారన్నారు. జేసీ దివాకర్‌ రెడ్డి మనిషేనా? పశువా అని ఫైర్‌ అయ్యారు. హుందా తనం లేకుండా, నోరు ఉందని రెండక్షరాలు మాట్లాడితే గొప్పతనం అవుతుందా అన్నారు. సంస్కారం ఉన్న మనిషిలా మాట్లాడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకవచనంతో వాడు - వీడు అని మాట్లాడటం దుర్మార్గమన్నారు. జేసీ లాంటి వ్యక్తులు ఉండబట్టే రాజకీయాలు భ్రష్టుపట్టాయన్నారు. చంద్రబాబు పాదాలు కడిగి నీ తలపై పోసుకుంటే ఎవరు వద్దనరని, ఇతరులను ఇష్టంవచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. మనిషికి వయసు వస్తే సరిపోదని, బుర్ర కూడా పెరగాలన్నారు. ఇలాంటి మాటలకు ఫుల్‌ స్టాప్‌ ఉండాలి కాబట్టి మాట్లాడుతున్నానన్నారు. సభ్యత - సంస్కారంతో మనం ప్రవర్తించాలని హితవు పలికారు.