Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసు: హైకోర్టుకు కూతురు, భార్య విన్నపం

By:  Tupaki Desk   |   25 Feb 2020 5:00 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసు: హైకోర్టుకు కూతురు, భార్య విన్నపం
X
చంద్రబాబు సీఎంగా ఉన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఆయన కూతురు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకెక్కారు. కర్నూలులో హత్యాచారానికి గురైన ఓ బాలిక కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సీఎం వైఎస్ జగన్.. తమపైనా దయ చూపాలని.. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును అభ్యర్థించారు. సొంత సోదరి కోరిపైనా దయ చూపి కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు.

వైఎస్ వివేకా కేసును సీబీఐకి అప్పగించాలన్న ఆయన కూతురు భార్య పిటీషన్ పై హైకోర్టు విచారించింది. జగన్ ప్రభుత్వం తరుఫున ఈ కేసులో వాదన వినిపించారు. ప్రస్తుతం సీఐడీ దర్యాప్తు తుదిదశకు వచ్చిందని.. సాఫీగా సాగుతోందని.. ఈ క్రమంలో సీబీఐకి అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.

ఇక కర్నూలులో బాలిక కేసును సీబీఐకి అప్పగించినట్టే.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వీరారెడ్డి అనే వ్యక్తి వేసిన పిటీషన్ పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్నూలు అంశానికి, వైఎస్ వివేకా హత్యకు ఏం సంబంధమని న్యాయమూర్తి ప్రశ్నించారు. వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటీషన్ ఉపసంహరించుకుంటామని కోరడం తప్పేం లేదని వ్యాఖ్యానించారు. అనంతరం ఈ కేసులో తీర్పును వాయిదా వేశారు.