Begin typing your search above and press return to search.

సంచలనంగా వైఎస్ వివేక కుమార్తె సునీత వాంగ్మూలం

By:  Tupaki Desk   |   28 Feb 2022 7:56 AM GMT
సంచలనంగా వైఎస్ వివేక కుమార్తె సునీత వాంగ్మూలం
X
పెను సంచలనంగా మారి.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీసి వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు వాంగ్మూలం ఇవ్వటం.. అందులోనివి కొన్ని బయటకు రావటం తెలిసిందే. తాజాగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత సీబీఐకు కీలక వాంగ్మూలాన్ని ఇచ్చారు. అందులోని అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. అందులో ఏముంది? సునీతమ్మ ఏమని చెప్పారు? సీఎం జగన్ ను కలిసిన సందర్భంలో సునీత ఆయనకు ఏం చెప్పారు? అందుకు జగన్ ఏమని బదులిచ్చారు? లాంటి విషయాలు ఈ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

తన తండ్రి వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలామందికి తెలుసని.. హంతకులెవరో తేల్చాలని జగన్ (ఆయన పేరును నేరుగా చెప్పకుండా అన్న అన్న ప్రస్తావన తెచ్చారు) అన్నను కోరానని.. తనకు ఎవరి మీద అనుమానం ఉందో వారి పేర్లు కూడా చెప్పానని చెప్పారు. తాను చెప్పిన అనుమానితుల జాబితాను విన్నజగన్.. అందుకు స్పందించిన తీరు బాధించిందని ఆమె పేర్కొన్నారు. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని కోరా.. అందుకు స్పందిస్తూ.. ‘సీబీఐకి ఇస్తే ఏమవుతుంది? అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరతాడు. అతడికేమీ కాదు. 11 కేసులకు మరొకటి తోడై పన్నెండు కేసులు అవుతాయి’ అని సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం తనను బాధించినట్లు ఆమె వెల్లడించారు.

అనుమానితుల జాబితాలో జగన్ భార్య భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి.. ఆసుపత్రిలో పని చేసే కాంపౌండర్ ఉదయ్కుమార్ రెడ్డి పేరు చేర్చటంపైనా జగన్ కోప్పడినట్లుగా వాపోయారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా ఎవరోకాంపౌండర్ ఎక్కువయ్యారని.. తన తండ్రి మరణ వార్తతో సంబరాలు చేసుకోవటానికి బాణసంచా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టారు? అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కారణంగానే తనకు న్యాయం జరగాలనే హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. హత్య జరిగిన రోజు కూడా నాన్న మరణించాడని మొదట భారతికి.. తర్వాత జగన్ కు ఫోన్ చేసి చెబితే.. అవునా అంటూ చాలా తేలిగ్గా స్పందించారని.. ఆశ్చర్యం.. బాధ లాంటివి కొంతైనా కనిపించలేదన్నారు. సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. 2020 జులై 7న ఆమె వాంగ్మూలాన్ని ఇచ్చారు. అందులో ఏముందంటే?

- 2019 మార్చి 15న ఉదయం 5.30 గంటలకు నా భర్త రాజశేఖర్‌రెడ్డికి పులివెందుల నుంచి ఫోన్‌ వచ్చింది.. అదుర్దాగా మాట్లాడుతుంటే నేను, మా అమ్మ గమనించాం. అడగ్గానే మీ నాన్న చనిపోయాడని చెప్పారు. వెంటనే రెండు కార్లలో హైదరాబాద్‌ నుంచి బంధువులతో కలిసి పులివెందులకు బయలు దేరాం.

- ఉదయం ఏడున్నరకు టీవీలో వార్తల్లో గుండెపోటుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నా భర్తకు ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్‌ చేసి కేసు పెట్టమంటారా? అని అడిగాడు. అదే సమయంలో వివేకా సహాయకుడు ఇనయతుల్లా వాట్సాప్‌ నుంచి ఫోటోలు వచ్చాయి. అవి నా భర్తకు చూపించా.. రక్తంతో పాటు తలపై గాయాలు చూస్తే అమ్మ భయపడుతుందని మాట్లాడకుండా చూపించా.

- కార్లో నా పక్కనే కూర్చున్న మా అమ్మ ఎర్ర గంగిరెడ్డికి ఫోన్‌ చేయమంటే.. ఎన్ని సార్లు చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి మేం పులివెందులకు వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దని చెప్పా. మా బంధువు డాక్టర్‌ అభిషేక్‌ రెడ్డికి ఫోన్‌ చేసి ఇదే విషయం చెప్పాం.

- కాసేపటికే ఇంకో ఫోన్‌ వచ్చింది. పోస్టుమార్టం పూర్తయిందని.. కుట్లేసి కట్టు కట్టేశారని చెప్పారు. బంధువులెవరూ నోరు మెదపలేదు.. అనుమానం ఇంకా బలపడింది. ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని తెలిసింది.

- నాన్నకు సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని అనడంతో హత్య జరిగిందని ఖరారైంది. వెంటనే సీఐ శంకరయ్యకు నా భర్త రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ చేసి కేసు రిజిస్టర్‌ చేయమని చెప్పారు. నాన్న హత్య గురించి తెలిసినా పులివెందులలో ఉన్న అనుమానితులు.. అంత్యక్రియలు ఈ రోజే అయిపోవాలని హడావుడి చేస్తున్నారు.

- దీంతో అమ్మ ఒకసారి విషయం జగన్‌కు చెప్పమనడంతో అన్నకు ఫోన్‌ చేశా. నేను చూసుకుంటానన్నారు. శంకర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడైన భరత్‌ యాదవ్‌కు ఈ హత్య గురించి మొత్తం తెలుసు. భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డికి లోపల మా తండ్రి అంటే గిట్టదు.. కానీ బయటకు స్నేహం నటించేవారు.

- నాన్న హత్యకు సంబంధించి రంగన్న, ఎర్ర గంగిరెడ్డి, పందింటి రాజశేఖర్‌, ఎంవీ కృష్ణారెడ్డి, డ్రైవర్‌ ప్రసాద్‌, వెన్నపూసల రాజేశ్‌, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఈసీ సురేందర్‌రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీఐ శంకరయ్య, రామక్రిష్ణారెడ్డి, సురేందర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని విచారిస్తే నిజాలు బయటికి వస్తాయి.

- డ్రైవర్‌ దస్తగిరిని మా నాన్న ఉద్యోగం నుంచి తీసేశారు.. సునీల్‌ యాదవ్‌ మనిషి అని అనుమానం రావడంతో.. మా బావ ద్వారా రికమెండ్‌ చేయించినా మా అమ్మ అంగీకరించలేదు.