Begin typing your search above and press return to search.

కోర్టులో బెయిల్ లభించిన తర్వాత షర్మిల మీడియాతో ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   30 Nov 2022 4:04 AM GMT
కోర్టులో బెయిల్ లభించిన తర్వాత షర్మిల మీడియాతో ఏం మాట్లాడారు?
X
కేసీఆర్ పాలన తీరు మీద నిప్పులు చెరుగుతున్న వైసీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తన పాదయాత్ర 3500 కి.మీ. పూర్తి అయిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. ఆమె పాదయాత్రను అడ్డుకోవటం.. వాహనం మీద దాడి చేసి.. నిప్పు అంటించటం తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిల ముఖానికి స్వల్ప గాయాలుకావటం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి మొదలైన హైడ్రామా.. రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉంది. సాయంత్రం వేళలో షర్మిలను అరెస్టు చేయటం అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించటం.. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించటం తెలిసిందే.

రాత్రి 11 గంటల వరకు నాంపల్లి కోర్టులోనే ఉండాల్సి వచ్చిన షర్మిల.. ఆమెపై పెట్టిన కేసులకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె లోటస్ పాండ్ కు వచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను తాను ప్రశ్నించానని.. అందుకే తనను అరెస్టు చేయించారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న ఆమె.. తాను ప్రజల పక్షాన నిలబడ్డానని.. అదే తన తప్పా? అని ప్రశ్నించారు.

పోలీసులు అధికారుల మాదిరి కాకుండా రౌడీల మాదిరి వ్యవహరించారన్న ఆమె.. తమ కార్యకర్తల్ని పోలీసులు ఎందుకు కొట్టినట్లు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నెలకొన్న హైడ్రామాలో ఆమెను అదుపులోకి తీసుకునే ముందు.. టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన తన కారుతో వెళ్లి ప్రగతిభవన్ వద్ద నిరసన చేపట్టాలని భావించటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమెను కారు నుంచి దించాలని ప్రయత్నించటం.. ఆ సందర్భంగా కారు అద్దాలు వేసుకొని లోపలే ఉండటంతో.. కారు అద్దాల్ని బ్రేక్ చేసే వ్యక్తిని తెప్పించి మరీ.. కారు అద్దాల్ని తొలగించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కారును టోయింగ్ చేసుకుంటూ వెళ్లిపోవటం.. ఆ సమయంలో కారులోనే షర్మిల ఉండటం సంచలనంగా మారింది.

అనంతరం ఆమెను ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆమెను కోర్టుకు తరలించటం.. అక్కడ జరిగిన వాదోపవాదాల నడుమ చివరకు న్యాయస్థానం బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తమ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా దాడి చేశారని.. అదుపులోకి తీసుకున్న తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముందని షర్మిల ప్రశ్నిస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వరుస పరిణామాలు చోటు చేసుకున్నా.. అలసట లేకుండా షర్మిల వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆమె ఎంత మొండిది.. పట్టుదల ఉన్న వ్యక్తి అన్నమాట ఇప్పుడు వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.