Begin typing your search above and press return to search.

షర్మిల ఎఫెక్ట్ : పెద్ద గుండు సున్నానేనా...?

By:  Tupaki Desk   |   12 July 2022 7:53 AM GMT
షర్మిల ఎఫెక్ట్ : పెద్ద గుండు సున్నానేనా...?
X
తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఇంటికి వెళ్ళినపుడు వైఎస్ షర్మిల గురించి మాట్లాడబోతున్నారు అని ముందే కోమటిరెడ్డి క్యాడర్ మీడియాకు లీక్ ఇచ్చారు అని అంటున్నారు. తెలంగాణా రాజకీయాల్లో ఆమెను పెద్ద నాయకురాలిగా చూపించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. కానీ ఖమ్మం జిల్లాలో షర్మిల పార్టీ ప్రభావం ఎంత ఉంది అని టేయారెస్ వాళ్ళు సర్వే చేయించినపుడు అంత అయితే సీన్ ఆమెకు లేదని తేలిందట.

అంతే కాదు నోటా కంటే కూడా తక్కువ ఓట్లు వైఎస్సార్టీపీకి వస్తాయని ఆ సర్వేలో తేలిందట. ఎందుకంటే ఓట్లు ఎపుడూ ఫైట్ చేసే పార్టీలకే జనాలు వేయడం అలవాటు. అలాగే గెలుపు గుర్రాల వైపే జనాలు మొగ్గు చూపిస్తారు. ఆ విధంగా జన చైతన్యం కూడా చాలా కాలంగా పెరిగింది కూడా.

ఇక టీయారెస్ వాళ్ళు చేయించినట్లుగా చెబుతున్నఒకానొక సర్వేలో చూస్తే ఇక్కడ ఆమెకు ఏమి పని అని జనాలు అడిగినట్లుగా కూడా చెబుతున్నారు. మేము కాంగ్రెస్ కి ఓటు వేస్తాము కానీ వేరే వాళ్లకు కాదని కూడా చెప్పారుట. ఇక ఖమ్మంలో కాంగ్రెస్ వర్సెస్ టీయారెస్ గా పోటీ గట్టిగానే ఉంది అంటున్నారు.

ఇక వైఎస్ షర్మిల వెంట వచ్చే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులే అని చెబుతున్నారుట. దీంతో కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణాలో షర్మిలకు అంత సీన్ లేదని డిసైడ్ అయ్యారుట. నిజానికి వైఎస్సార్ ది ఆధ్రా మూలాలు ఉన్న నేపధ్యం. ఆయన సమైక్య వాదిగానే ఉన్నారు. మరో వైపు చూస్తే ఆయన చనిపోయి పదమూడేళ్ళు అయింది. జనరేషన్స్ మారిపోయాయి.

ఇక తెలంగాణాలో వైఎస్సార్ తరువాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. కాంగ్రెస్ నాలుగేళ్ళ పాటు పాలిస్తే ఎనిమిదేళ్లకు పైగా టీయారెస్ జమానా ఉంది. టీయారెస్ తెలంగాణా కొట్లాడి తెచ్చిన పార్టీగా జనాలలో ఉంది. అదే టైమ్ లో టీయారెస్ కి ధీటుగా ఉన్న పార్టీ ఏది అంటే కాంగ్రెస్ నే అంతా చూపిస్తారు ఈ రోజుకీ ప్రతీ పల్లెలో బూత్ లెవెల్ దాకా కాంగ్రెస్ ఉంది.

కాంగ్రెస్ కి పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక జోష్ పెరిగింది అన్నది వాస్తవం. గత రెండు ఎన్నికల్లో టీయారెస్ ని ఢీకొట్టిన పార్టీగా కాంగ్రెస్ ఉంది. అలాంటి కాంగ్రెస్ ఓట్ల చీలిక కోసం వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ ద్వారా కృషి చేసినా కుదిరే వ్యవహారం కాదనే అంటున్నారు. ఈ మధ్య యూపీ ఎన్నికల్లో చూసుకున్నా ఓట్ల చీలిక రాజకీయాలు నడవలేదు. ఏ పార్టీకి పడాల్సిన ఓట్లు ఆ పార్టీకి పడ్డాయి.

ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జనాలు డిసైడ్ అయినపుడు మిగిలిన వాటిని ఏ మాత్రం పట్టించుకునే సీన్ లేదనే అంటున్నారు. ఇక వైఎస్ షర్మిల విషయానికి వస్తే ఆమె ఏపీ మూలాలు ఉన్న మహిళగానే చూస్తున్నారు. తాను తెలంగాణా కోడలిని అని ఆమె గట్టిగానే చెప్పుకున్నా కూడా ఆ ఇంపాక్ట్ లేదు. తెలంగాణా వాదం లేదనుకోవడం కూడా పొరపాటే అని చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్ పటిష్టమైన ఓటు బ్యాంక్ తో ఉంది. అదే టైమ్ లో కాంగ్రెస్ లో చాలా మంది దిగ్గజ నేతలు ఉన్నారు. గత రెండు ఓటముల నుంచి గుణపాఠాలు అయితే నేర్చుకున్నారు. దాంతో ఈసారి కాంగ్రెస్ లో గెలుపు ఉత్సాహాంతో పాటు తగిన రీతిన వ్యూహాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో వైఎస్ షర్మిల పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపించలేదని అంటున్నారు.

ఇక ఎంతసేపూ వైఎస్సార్ పధకాల గురించి చెప్పడం తప్ప తెలంగాణా మూలల్లోకి వైఎస్సార్టీపీ వెళ్ళలేకపోతోంది అన్నది కూడా అంతా అంటున్న మాట. ఆమె పార్టీకి ఈ రోజుకీ చెప్పుకోతగిన నాయకుడు లేడు. అదే విధంగా పార్టీ పెట్టి ఏణ్ణర్ధం దాటినా కూడా తగిన విధంగా పార్టీ ఎక్కడా పటిష్టం కాలేదు.

ఈ నేపధ్యంలో షర్మిల గెలుపే పెద్ద సవాల్ గా మారినా మారవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా సర్వే ఫలితాలు చూస్తే మాత్రం వైఎస్సార్టీపీ నామమాత్రమే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇంత ప్రయత్నం చేసినా కూడా చివరికి తెలంగాణా రాజకీయాల్లో అతి పెద్ద గుండు సున్నానే ఆ పార్టీ సొంతం చేసుకుంటుందా అన్న చర్చ అయితే ఉంది మరి.