Begin typing your search above and press return to search.

ఉన్నట్లుండి బీజేపీ మీద పడ్డ షర్మిలమ్మ

By:  Tupaki Desk   |   31 Dec 2022 3:44 AM GMT
ఉన్నట్లుండి బీజేపీ మీద పడ్డ షర్మిలమ్మ
X
రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి. అవి పారనపుడు మరిన్ని మార్చుకోవాలి. అలాగైతేనే వర్తమానంలో రాజకీయం చేయగలరు ఎవరైనా. ఇపుడు చూస్తే కొన్నాళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎంతో కొంత రాటుతేలే ఉంటారు. అందుకే ఆమె సమయానుకూలంగా తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

ఇప్పటిదాకా బీజేపీ మీద కమలనాధుల మీద అసలు పెదవి విప్పని షర్మిల ఉన్నట్లుండి బిగ్ సౌండ్ చేశారు. బీయారెస్ బీజేపీ రెండూ ఒక్కటే అని పెద్ద మాట అనేశారు. లేకపోతే కేసీయార్ అవినీతి మీద ఎందుకు సీబీఐ విచారణ జరిపించరు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. కేసీయార్ ది అవినీతి పాలన అంతారు నరేంద్ర మోడీ. దేశంలోనే ఆయన అత్యంత అవినీతి పరుడు కేసీయార్ అని అమిత్ షా విమర్శిస్తారు.

తెలంగాణాను ఏటీఎం గా వాడుకుంటున్నారు కేసీయార్ ని బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ అంటారు. అయితే ఇవన్నీ మాటలే తప్ప చేతలకు బీజేపీ ఎందుకు దిగదని ఆమె నిలదీస్తున్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద టన్నుల కొద్దీ ఆధారాలు కేంద్రానికి ఇచ్చినా ఇప్పటిదాకా ఎందుకు దర్యాప్తు చేయరని ఆమె ప్రశ్నిస్తున్నారు

రెండు పార్టీలూ కూడా పరస్పరం విమర్శలు చేసుకోవడం కూడా ఒక డ్రామా అని ఆమె అంటున్నారు. కేసీఆర్ కేంద్ర నిధుల ఏజెన్సీల నుంచి కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకుని అందులో భారీగా మోసం చేశారు. అయినా బీజేపీ దీనిపై ఎలాంటి విచారణకు ఆదేశించదు అని ఆమె డైరెక్ట్ క్వశ్చన్ నే ఎక్కుపెట్టారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమ వేటపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన బీజేపీ కేసీఆర్ అవినీతిపై అలాంటి డిమాండ్ ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. ఇలా ఆమె చాలా ప్రశ్నలనే అడిగి కడిగేశారు. ఇక చివరాఖరున ఆమె మరో పెద్ద మాట అన్నారు. కేసీఆర్ దోచుకున్న దోపిడిలో బీజేపీ నేతలకు వాటా ఉండవచ్చు అని. ఇలా షర్మిల ఘాటుగానే విమర్శలు చేస్తూ రెండు పార్టీల మీద ఆరోపణలు గుప్పించడం చర్చకు తావిస్తోంది.

ఆమె ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదే చర్చగా ఉంది. నిజానికి వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి షర్మిల కేవలం బీయారెస్ మీదనే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో బీయారెస్ నాయకులు ఆమె బీజేపీ వదిలిన బాణం అని కూడా ఆరోపించారు. దానికి తగినట్లుగా షర్మిల కారుని ఎత్తి కుదేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి అరెస్ట్ చేసిన ఘటనలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు.

ఇదిగో చూశారా ఆధారాలు అని బీయారెస్ నేతలు నాడు బిగ్గరగా కామెంట్స్ చేస్దినా స్పందించని షర్మిల ఇపుడు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. దానికి కారణం ఏంటో తరువాత తెలుస్తుంది కానీ తన మీద బీజేపీ ముద్ర వేసినపుడు మాట్లాడని షర్మిల ఇపుడు పెద్ద నోరు చేస్తే ఫలితం ఉంటుందా అన్నదే చూడాలని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.