Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీగా సవాంగ్..ఏబీకి నో పోస్టింగ్ - ప్రింటింగ్ కు ఠాకూర్

By:  Tupaki Desk   |   30 May 2019 10:45 PM IST
ఏపీ డీజీపీగా సవాంగ్..ఏబీకి నో పోస్టింగ్ - ప్రింటింగ్ కు ఠాకూర్
X
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించిన పోలీసు ఉన్నతాధికారులను ఆయా పదవులను నుంచి తప్పిస్తూ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే సీఎంఓలోని నలుగురు ఐఏఎస్ అధికారులను అక్కడి నుంచి తప్పించేసిన జగన్... తనకు అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డిని నియమించుకున్నారు. ఆ వెంటనే రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్ రెడ్డిని తనకు ఓఎస్డీగా నియమించుకున్నారు.

ఈ మూడు ఉత్వర్లులు వెలువడిన కాసేపటికే... ఏపీ డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను ఆ పదవి నుంచి తప్పిస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీజీపీగా తప్పించిన ఠాకూర్ ను అంతగా ప్రాధాన్యం లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బదిలీ చేశారు. ఇక కొత్త డీజీపీగా గౌతం సవాంగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఇంటెలిజెన్స్ డీజీగా ఉంటూ వివాదాస్పదంగా మారిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీ పోస్ట్ నుంచి తప్పించి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టేశారు. ఏసీబీ నుంచి తొలగించిన ఏబీని తక్షణమే జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి ఏబీని ఎన్నికల సమయంలో ఏసీబీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏసీబీ నుంచి కూడా ఆయనను తప్పించడంతో అక్కడే ఇన్ చార్జీగా పనిచేస్తున్న విశ్వజిత్ కు పూర్తి స్థాయిలో ఆ శాఖ బాధ్యతలను అప్పగించారు.తొలి రోజే ప్రక్షాళనను మొదలెట్టేసిన జగన్... ఓ వారంలోగానే తన డ్రీమ్ టీమ్ ను ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.