Begin typing your search above and press return to search.

బాబుకు షాక్.. కూల్చివేతకు జగన్ ఆదేశం

By:  Tupaki Desk   |   24 Jun 2019 12:17 PM IST
బాబుకు షాక్.. కూల్చివేతకు జగన్ ఆదేశం
X
చంద్రబాబు కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.. ప్రజావేదికను కృష్ణ నది కరకట్టపై అక్రమంగా నిర్మించుకున్నారని.. దాన్ని ఎల్లుండి కూల్చివేయాలని సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఏపీలోని సీఎం చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికలో జగన్ కలెక్టర్ల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాలనపై దిశానిర్ధేశం చేశారు.

ప్రజావేదికలో ఎందుకు సమావేశం పెట్టింది జగన్ వివరించారు. కృష్ణ నది కరకట్టపై చంద్రబాబు అక్రమంగా ఈ ప్రజావేదికను, ఆయన ఇంటిని కట్టారని.. రూ.5 కోట్లకు ప్రతిపాదించి రూ. 8 కోట్లతో పూర్తి చేశారని.. 3 కోట్లు దిగమింగారని.. అడుగడుగునా అక్రమాలు, అవినీతితో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఈ ప్రజావేదికను చూపించాలనే ఇక్కడ మీటింగ్ పెట్టినట్టు జగన్ ప్రకటించారు. ఎల్లుండి ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

చంద్రబాబు సీఎంగా ఉండగా కరకట్టపై విలాసవంతమైన భవనాన్ని తన సీఎం కార్యాలయంగా చేసుకున్నారు. దానిపక్కనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమావేశాలు సమీక్షలు నిర్వహించేందుకు ప్రజావేదికను నిర్మించుకున్నారు.

చంద్రబాబు ఓడిపోగానే సీఎం జగన్ కు రాసిన మొదటి లేఖ ఈ ఇళ్లు, ప్రజావేదికపైనే.. తాను సీఎంగా ఉన్నప్పుడు ఉన్న ఇంటిని.. దానిపక్కనే ఉన్న ప్రజావేదికను తాను వినియోగించుకుంటానని.. అనుమతి ఇవ్వాలని జగన్ కు లేఖ రాశారు.అయితే జగన్ ప్రభుత్వం బాబు లేఖపై ఇంతవరకు స్పందించలేదు.

కాగా అవినీతి, అక్రమంగా కట్టిన ఈ ప్రజావేదికను ఇప్పుడు సీఎం హోదాలో జగన్ కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. చంద్రబాబు ఇంటిపక్కనే కలెక్టర్ల సదస్సు పెట్టి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా కట్టిన ఇళ్లు, భవనాలను కూల్చివేయాలని జగన్ సంచలన ఆదేశాలిచ్చారు. మరి సీఎం ఇంటిని కూడా కూల్చేస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.