Begin typing your search above and press return to search.

తాగాలంటే భయపడేలా బాదిన జగన్

By:  Tupaki Desk   |   16 Aug 2019 6:18 AM GMT
తాగాలంటే భయపడేలా బాదిన జగన్
X
ఆదాయం వస్తుంటే వెనుకా ముందు చూసుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలకు సంబంధించినంత వరకూ ఎక్కువ ఆదాయ వనరుగా మారింది మద్యం.. పెట్రోల్.. డీజిల్ అమ్మకాలతోనే. మరి.. బంగారు బాతుగుడ్డు లాంటి మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని పెంచుకోవటానికి భిన్నంగా వ్యవహరిస్తూ అందరి అటెన్షన్ తన మీద పడేలా వ్యవహరిస్తున్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో తానిచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో నిక్కచ్చిగా ఉండే జగన్.. తాను ముఖ్యమంత్రిపదవి చేపట్టిన రెండున్నర నెలల్లోనే పాక్షిక మద్యపానం దిశగా అడుగులు వేస్తున్నారు.

రాష్ట్రంలోదశల వారీగా పాక్షిక మధ్యనిషేధాన్ని అమల్లోకి తీసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మద్యపానం కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితితో పాటు.. ఆరోగ్య పరిస్థితి దారుణంగా దెబ్బ తింటోంది. ఈ నేపథ్యంలో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన జగన్.. తాను పవర్లోకి వస్తే.. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమల్లోకి తెస్తానని మాట ఇచ్చారు. అందుకు తగ్గట్లే.. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండున్నర నెలల వ్యవధిలోనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాజాగా ఏపీలో మద్యం ధరలు మరింత ఖరీదు అయ్యేలా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ధరల పెంపు ద్వారా మందుబాబుల్లో మందు తాగాలన్న ఆలోచన వచ్చేందుకు భయపడేలా చర్యలకు రెడీ అవుతున్నారు. అక్టోబరు ఒకటి నుంచి ఏపీలోకి కొత్త పాలసీని అమల్లోకి తేనున్నారు. దీని ద్వారా గత ఏడాది కంటే ఎక్కువగా ధరల్ని నిర్ణయించారు. ఈ పెంపు పది శాతం వరకూ ఉంటుందని చెబుతున్నారు.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బాటిల్ మీద రూపాయి పెంచినా.. చివరకు రూ.10 వరకు అదనంగా చెల్లించాల్సి రావటం. ఎందుకంటే.. మద్యం అమ్మకాల్లో రూ.10 రౌండాఫ్ విధానం ఉంది. ప్రస్తుత ధరలకు అనుగుణంగా చివర్లో సున్నాతో ఉంటాయి. దీని కారణంగా ప్రభుత్వం ఎంత పెంచినా.. దాని ధర రూ.10మేరకు పెరుగుతుంది. తాజాగా పెంచే ధరల పెంపు కారణంగా ఏపీ ప్రభుత్వానికి రూ.2297 కోట్లు అదనపు ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. తాజా పెంపు కారణంగా ఒక్కో సీసాపై కనీసం రూ.10 నుంచి బాదుడు షురూ అవుతుందని చెబుతున్నారు. ధరల పెంపు కారణంగా ప్రభుత్వానికి అదనంగా వస్తున్న ఆదాయం రూ.2297 కోట్లు ఉంటే.. వ్యాట్ కలుపుకుంటే ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఆదాయం రూ.5వేల వరకూ ఆదాయం వస్తుందన్న అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయంతో పాటు.. మందు తాగాలంటే ఆచితూచి అన్నట్లుగా ఉండేలా జగన్ ప్లానింగ్ రానున్న రోజుల్లో మద్యపాన వినియోగం తగ్గే వీలుందన్న మాట వినిపిస్తోంది.