Begin typing your search above and press return to search.

మదర్ థెరిసా మీద అంత మాట అనేశాడు

By:  Tupaki Desk   |   21 Jun 2016 5:06 AM GMT
మదర్ థెరిసా మీద అంత మాట అనేశాడు
X
కొందరు బీజేపీ నేతల మాటలు కాస్త చిత్రంగా ఉంటాయి. వారు చేసే ఆరోపణలు.. విమర్శలు చాలామందికి మంట పుట్టేలా ఉంటాయి. అయినా వారు తాము చేసే వాదనల నుంచి అడుగు కూడా వెనక్కి తగ్గరు. తమ మాటల కారణంగా తరచూ వివాదాలు వెల్లువెత్తినా.. అంతిమంగా పార్టీ ఇమేజ్ కు ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని తెలిసినా తాము చెప్పానుకున్న విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తారే కానీ వివాదాలకు దూరంగా ఉండాలని మాత్రం అనుకోరు. తాజాగా ఆ తరహా మాటల్నే మరోసారి చెప్పి సరికొత్త వివాదానికి తెర తీశారు బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్.

‘మదర్’గా దేశం మొత్తం కొలవటమే కాదు.. సేవకు ప్రతిరూపంగా భావించే మదర్ థెరిస్సా మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ ను క్రైస్తవ దేశంగా మార్చే కుట్రలో ఆమె ఒక భాగమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలే అరుణాచల్ ప్రదేశ్.. త్రిపుర.. మేఘాలయ.. నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు ఉద్యమాలకు ఆజ్యం పోసినట్లుగా వ్యాఖ్యానించారు.

‘‘ఆ ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితుల గురించి మీకు పూర్తిగా తెలియదు. అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలంటే ఆ ప్రాంతాల్ని తప్పనిసరిగా సందర్శించాలి’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటల కారణంగా వివాదాలు మరింత పెరుగుతాయే కానీ.. తగ్గుముఖం పట్టవు. ఒకవేళ తాను చెప్పే విషయంలో వాస్తవం ఉంటే. దానికి బలాన్ని చేకూరేలా ఆధారాల్ని చూపిస్తే బాగుంటుంది. అలాంటిదేమీ లేకుండా నోటికి వచ్చినట్లుగా చెప్పేయటం ఏమిటో ఈ ఎంపీగారికే తెలియాలి.