Begin typing your search above and press return to search.

వైసీపీలో మరో వికెట్ పడింది

By:  Tupaki Desk   |   28 Feb 2016 12:52 PM IST
వైసీపీలో మరో వికెట్ పడింది
X
ఏపీ రాజకీయాలు ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ ను తలపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం కథ ముగించడానికి తమకు ఎంతో సమయం అవసరం లేదని బీరాలు పలికిన జగన్ ఇప్పుడు తన టీంలో వికెట్లను కాపాడుకోలేక నానా పాట్లు పడుతున్నారు. టీడీపీ నిప్పులు చెరిగేలా విసురుతున్న బంతులకు వైసీపీలో వికెట్లు ఒక్కటొక్కటిగా పడుతున్నాయి. తాజాగా ఆదివారం మరో వికెట్ పడింది..

వైకాపా ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ్ల పాలెం నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన కొద్ది సేపటి కిందట విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యి, ఆయన సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. డేవిడ్ రాజుకు తెలుగుదేశం కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంతోనే తాను టీడీపీలో చేరినట్లు డేవిడ్ రాజు చెప్పారు. ప్రజలు కూడా అభివృద్ధినే కాంక్షిస్తున్నారని.. అందుకే వారి మనోభావాలను అనుగుణంగానే తాను వైకాపాను వీడి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న చంద్రబాబునాయకత్వంపై విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో చేరానని వివరించారు.