Begin typing your search above and press return to search.

బల పరీక్షకు ముందే యడియూరప్పకు సవాల్‌!

By:  Tupaki Desk   |   27 July 2019 3:28 PM GMT
బల పరీక్షకు ముందే యడియూరప్పకు సవాల్‌!
X
పలు రాజకీయ సమీకరణాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్‌ యడియూరప్పకు ఆరంభం నుంచి అగ్నిపరీక్షలు అడ్డంకిగా మారుతున్నాయి. సభలో బల పరీక్ష కూడా పూర్తి కాక ముందే కేబినెట్‌ కోసం పలువురు నేతలు లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా తొలివిడతలో కేవలం 10 మందికి మాత్రమే స్థానం కల్పించాలని బీజేపీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. కర్ణాటక కేబినెట్‌ లో మొత్తం 34 మంది మంత్రులుగా కొనసాగవచ్చు. అయితే అన్ని జిల్లాల నుంచి ఆశావహులు పోటీలో ఉన్నారు. ఒకరికి ఇస్తే ఇంకొకరి నుంచి యడియూరప్పపై అసమ్మతి మొదలయ్యే అవకాశం ఉంది. ఈక్రమంలో కేబినెట్‌ తో పాటు డిప్యూటీ సీఎం పదవి భర్తీ చేయడం కూడా యడియూరప్పకు పెద్ద సవాల్‌ మారింది. అయితే బీజేపీ అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి లేకుండా కేవలం సీఎంతోనే పాలన సాగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈక్రమంలో డిప్యూటీ సీఎం పదవిపై కన్నేసిన వారికి నిరాశ ఎదురు కానుంది. దీంతో కేబినెట్‌ ఆశించే వారి సంఖ్య మరింత ఎక్కువ కానుంది.

కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన 15 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్‌ బెర్తు ఆశించినట్లు తెలిసింది. అదేవిధంగా బీజేపీకి చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో చోటు కోసం పార్టీ పెద్దల వద్ద ఎవరికి వారు లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్‌ - భైరతి బసవరాజు - ఎన్‌.మునిరత్న - రోషన్‌ బేగ్‌ - జేడీఎస్‌ ఎమ్మెల్యే కె.గోపాలయ్య.... యడియూరప్ప కేబినెట్‌లో బెర్తు ఆశిస్తున్నారు. కుమారస్వామి ప్రభుత్వంలో కేబినెట్‌ బెర్తు లేకనే రాజీనామా చేశామని.. మంత్రివర్గంలో చోటు ఇస్తేనే బీజేపీలో చేరుతామని అసంతృప్త ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలిసింది. లేనిపక్షంలో అసమ్మతి వీడి కాంగ్రెస్‌ లోనే కొనసాగుతామని స్పష్టం చేసినట్లు సమాచారం.

బెంగళూరుకు చెందిన నలుగురు సీనియర్‌ నేతలు కేబినెట్‌ బెర్తు కోసం పట్టుబట్టినట్లు తెలుస్తోంది. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన ఒక్కళిగ కులానికి చెందిన ఆర్‌.అశోక్‌ మరోసారి కేబినెట్‌ బెర్తు కోసం పోరాడుతున్నారు. అదేవిధంగా పాత మైసూరు ప్రాంతంలో లింగాయత్‌ సముదాయం నుంచి బలమైన నేతగా పేరు గాంచిన వి.సోమణ్ణ మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అలాగే దళిత సముదాయానికి చెందిన అరవింద్‌ లింబావళి - బ్రాహ్మణ సముదాయానికి చెందిన ఎస్‌.సురేష్‌ కుమార్‌ కేబినెట్‌ బెర్తు కోసం లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సీఎన్‌ అశ్వర్థనారాయణ్‌ - ఎస్‌ ఆర్‌ విశ్వనాథ్‌ కూడా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు - కె.సుధాకర్‌ కూడా కేబినెట్‌ రేసులో ఉన్నట్లు తెలిసింది. అయితే బల పరీక్ష పూర్తయితే కానీ కేబినెట్‌ గురించి ఎలాంటి స్పష్టత రాకపోవచ్చు.