Begin typing your search above and press return to search.

బీజేపీకి ఆ రేంజే ఉంటే.. 2019లో ఎందుకు ట్రై చేయ‌లేదు!

By:  Tupaki Desk   |   10 Jun 2022 4:29 AM GMT
బీజేపీకి ఆ రేంజే ఉంటే.. 2019లో ఎందుకు ట్రై చేయ‌లేదు!
X
ఏపీ బీజేపీలో స‌రికొత్త నినాదం తెర‌మీద‌కి వ‌చ్చింది. 'వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి' అని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా.. ఇటీవ‌ల ఏపీలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు ఈ నినాదం నేర్పి వెళ్లారు. అంటే.. బీజేపీనే ఒంట‌రిగా.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చే స‌త్తా ఉంద‌ని.. కొంత మేర‌కు కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డితే చాల‌ని.. ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బీజేపీ ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటామ‌ని.. గెలిచి తీరుతామ‌ని కూడా చెప్పుకొచ్చా రు. ఇదే నిజ‌మ‌ని అనుకుంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే స‌త్తానే ఉం టే.. 2019లో ఏం చేశార‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

అప్ప‌ట్లో టీడీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను బీజేపీ నేత‌లు ఎందుకు ఒడిసి ప‌ట్టుకోలేక పోయారు? ప్ర‌జ‌ల‌ను ఎంద‌కు త‌మ‌వైపు తిప్పుకోలేక పోయారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. అప్ప‌ట్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఏదైనా ఉంటే.. దానిని వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది.

ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొంది. సునాయాసంగా అధికారంలోకి వ‌చ్చింది వైసీపీ. మ‌రి ఇప్పుడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటామ‌ని చెబుతున్న బీజేపీ నాయ‌కులు అప్పుడు కూడా ఒంట‌రిగానే పోటీ చేశారు క‌దా.. మ‌రి అప్ప‌ట్లో ఎందుకు మౌనం వ‌హించారు..? ప్ర‌జ‌ల‌ను త‌మ‌కు అనుకూ లంగా ఎందుకు మ‌లుచుకోలేక పోయారు? అనేది ప్ర‌శ్న‌. ఇవ‌న్నీ.. వినేందుకు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేకుండా.. పైపై మెరుగులతో నెట్టుకురావ‌డం.. పైపై నినాదాల‌తో స‌రిపుచ్చుకోవ‌డం.. బీజేపీకే చెల్లింద‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి ఏ పార్టీ అయినా.. అధికారంపై దృష్టి పెడితే.. చేసే ప‌నులు వేరే ఉంటాయి. ప్ర‌జ‌ల్లో ఉండ‌డం.. ప్ర‌జ‌ల తో క‌లిసి.. స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డం ముఖ్యంగా చేయాల్సిన ప‌ని. కానీ, ఇన్నేళ్ల‌లో ఏపీకి సంబందించి బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పోరాటం ఏదైనా ఉందా? అంటే.. లేదు. పైగా.. హిందూత్వ‌ను ప్ర‌జ‌ల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అంతేకాదు.. ఏపీకి న్యాయ‌బ‌ద్ధంగా రావాల్సిన విభ‌జ‌న హామీల‌ను తుంగ‌లో తొక్కుతున్నారు. ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన కోరిక‌గా ఉన్న ప్ర‌త్యేక హోదాను బుట్ట‌దాఖ‌లు చేశారు. ఇవ‌న్నీ మ‌రిచిపోయి... ఇప్పుడు ఒంట‌రిగానే అధికారంలోకి వ‌చ్చేస్తాం.. అని చెప్ప‌డం ద్వారా.. ఎవ‌రిని మ‌భ్య పెడుతున్నారో.. ఎవ‌రికోసం చంక‌లు గుద్దుకుంటున్నారో.. వారికే తెలియాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.