Begin typing your search above and press return to search.

ఢిల్లీ పవర్ : యంటీగా మాట్లాడితే నొక్కేయడమే...?

By:  Tupaki Desk   |   12 July 2022 5:30 PM GMT
ఢిల్లీ పవర్ : యంటీగా మాట్లాడితే నొక్కేయడమే...?
X
జగన్ కి కేంద్ర బలం అన్నది ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. గత మూడేళ్ళుగా ఆయనను ఏపీ బీజేపీ లీడర్స్ ఏమి అంటున్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు, ఇపుడు మాత్రం వారికి ఎక్కడ తలంటు పెట్టాలో అక్కడ పెట్టించేస్తున్నారు. ఇది పక్కా చంద్రబాబు మార్క్ ఫార్ములా. నాడు చంద్రబాబు ఏపీలో సీఎం గా ఉన్నపుడు కూడా బాబు వర్గం, వ్యతిరేక వర్గం బీజేపీలో ఉండేవి. వ్యతిరేక వర్గం బాబు సర్కార్ మీద గొంతు లేపితే ఢిల్లీ నుంచి వారికి చీవాట్లు పెట్టించే కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోయేది.

జగన్ అయితే మూడేళ్ళుగా తనను ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తరహా పెద్ద నోళ్ళకు తాళం వేయకపోతే చెడు సంకేతాలు వెళ్తాయని భావించి గట్టిగానే బిగిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో కేంద్రం వద్ద తన పలుకుబడి ఏంటి అన్నది చెప్పడానికి కూడా ఆయన అవకాశాలను వాడుకుంటున్నారు అని అంటున్నారు.

ఈ మధ్య భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్స‌వాలు జరిగితే లోకల్ ఎంపీ, బీజేపీ పెద్ద‌ల వద్ద బాగా పలుకుబడి ఉన్నదని చెప్పుకునే రఘురామ క్రిష్ణంరాజు చివరికి భీమవరం దరిదాపులకు కూడా రాలేకపోయారు. ఏకంగా పీఎం ఓ లిస్ట్ లోనే ఎంపీ గారి పేరు లేదని చెబుతున్నారు. మరి దాని వెనక గట్టిగానే రాజకీయం నడిచింది అంటారు. అలా రెబెల్ ఎంపీకి చుక్కలు చూపించిన వైసీపీ పెద్దలు ఇపుడు ఏపీ బీజేపీలో అంతా తానే అని చంకలెగరేస్తున్న ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడిని చీవాట్లు పెట్టించడం ద్వారా ఢిల్లీ ముందు పలుచన చేశారు అని అంటున్నారు.

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ కోరి మద్దతు ఇచ్చింది తప్ప తాము అడగలేదని ఏపీకి చెందిన సదరు బీజేపీ నేత అంతా సత్యమే చెబుతాను అన్న తీరున మాట్లాడారు. కానీ ఆయన మాటలను గంటల వ్యవధిలోనే ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలను చూసే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఖండించారు. తాము వైఎస్ జగన్ మద్దతు కోరామని, ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడామని కూడా చెప్పారు.

ఆ తరువాత సదరు అసత్యాలను మాట్లాడిన నేతకు క్లాస్ బాగా పీకారు అని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో జగన్ని గట్టిగా నమ్ముకున్న బీజేపీ హై కమాండ్ తమ పార్టీ నేతలను కూడా చూడకుండా మందలించడమే ఇపుడు చర్చగా మారింది. ఇపుడే కాదు, రానున్న రెండేళ్ళ తరువాత జరిగే ఎన్నికలు అనంతరం ఏర్పడే ప్రభుత్వం విషయంలో జగన్ సహాయం కోసం చూస్తున్న బీజేపీ పెద్దలు ఆయనతో సాన్నిహిత్యం మెయిన్ టెయిన్ చేస్తున్నారు.

ఇదే అదనుగా ఏపీలో తన ప్రత్యర్ధులను కట్టడి చేయడంతో పాటు, బీజేపీలో వైసీపీ వ్యతిరేక గొంతులను కూడా నొక్కేయడానికి ఢిల్లీ పవర్ ని వైసీపీ హై కమాండ్ బాగానే వాడుకుంటోంది అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాల మీద అటు వైసీపీలో ఇటు బీజేపీలో కూడా చర్చ సాగుతోంది. ఏపీలో ఎలా ఉన్నా ఢిల్లీ స్థాయిలో జగన్ మోడీ షాల మధ్య గట్టి బంధమే ఉందని, అందువల్ల తొందరపడి ఎవరు మాట తూలినా మూల్యం చెల్లించక తప్పదన్న మాట కూడా ఏపీ కాషాయం పార్టీలో వినిపిస్తోంది.

విమర్శలు వరకూ చేయాలి కానీ మరీ టార్గెట్ చేయకూడదు అన్నదేదో వారికి ఒక సంకేతంగా అందుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. అయినా సరే మర్యాదకైనా ఆ పార్టీ పెద్దల నుంచి థాంక్స్ అన్న మాట రాలేదన్నది ఒక చర్చగానే ఉంది. మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాల మీద వైసీపీ ఒక కచ్చితమైన స్ట్రాటజీతో ఉంది. దానికి ఢిల్లీ బీజేపీ పెద్దల సహకారం ఉందని అంటున్నారు. అందుకే బాబు కోరి మద్దతు ప్రకటించి మరీ తానూ మీ వైపే అని బీజేపీ పెద్దలకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటున్నారు.