Begin typing your search above and press return to search.

ప్రజా దర్బార్ తో వైసీపీ ఎంపీ దూకుడు

By:  Tupaki Desk   |   11 Oct 2021 12:52 PM GMT
ప్రజా దర్బార్ తో వైసీపీ ఎంపీ దూకుడు
X
ప్రజలకు చేరువ కావడం ప్రజా ప్రతినిధుల అతి ముఖ్య కర్తవ్యం. ప్రజలతో మమేకం కావడం ద్వారానే తమ కెరీర్ ని వారు తీర్చిదిద్దుకుంటారు. ఇందుకోసం వారు తమకు తోచిన మార్గాలను అనుసరిస్తారు. వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జి అయిన వి విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్ పేరిట ప్రజలతో ప్రతి నిత్యం అనుసంధానం కాబోతున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల సమస్యలపైన ప్రజలు తనకు ప్రతీ రోజూ మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల లోపల కలవవచ్చు అని ఆయన చెబుతున్నారు. ముందస్తు అప్పాయింట్మెంట్ లేకుండా నేరుగా ప్రజా దర్బార్ కి ఎవరైనా వచ్చి తమ సస్యలను చెప్పుకోవచ్చు. వాటిని అప్పటికపుడు ఎంపీ పరిశీలించి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు తెలియచేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తారు.

విజయసాయిరెడ్డి విశాఖలో గత ఆరేళ్ళుగా ఉంటున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా విశాఖను నోడల్ జిల్లాగా చేసుకున్నారు. తన ఎంపీ నిధులను విశాఖలోనే ఖర్చు చేస్తూ వస్తున్నారు. తనకున్న పలుకుబడితో అనేక సమస్యలను ఆయన ఇంతవరకూ పరిష్కరిస్తూ వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ముప్పయి రెండు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను కూడా చేపట్టి జనాల మనసు చూరగొన్నారు. వైసీపీకి ఉత్తరాంధ్రాలో రాజకీయంగా ఆయన అతి పెద్ద బలంగా మారారు. ఇక విజయసాయిరెడ్డి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రా జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.

ఇక ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ తిరుగులేని ఆధిక్యతను కనబరచడం వెనక విజయసాయిరెడ్డి చాణక్య రాజకీయం ఉంది. ఇక విజయసాయిరెడ్డి ఇప్పటిదాకా తన వద్దకు వచ్చిన వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే రానున్న రోజులలో ప్రజలతో మరింత ఎక్కువగా ఇంటరాక్ట్ కావాలన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రజా దర్బార్ కి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ ఎంపీగా, ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలను ఎప్పటికపుడు తెలుసుకుని పరిష్కరించడం కోసమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని చెబుతున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రాలో తనదైన పద్ధతిలో జనాలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రజా దర్బార్ ని రూపకల్పన చేశారు అంటున్నారు.