Begin typing your search above and press return to search.

జగన్ చెబితే రాజీనామాకు రెడీ: వైసీపీ ఎమ్మెల్యే సంచలనం

By:  Tupaki Desk   |   18 Dec 2020 11:45 AM GMT
జగన్ చెబితే రాజీనామాకు రెడీ: వైసీపీ ఎమ్మెల్యే సంచలనం
X
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం సెగలు రేపుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రాజధానులపై రెఫరెండం ఎన్నికలు నిర్వహిద్దామని.. ఓడిపోతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించడం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార వైసీపీ కూడా ఇప్పుడు ప్రతి సవాల్ విసురుతోంది.

తాజాగా గుంటూరులో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ర్యాలీ తీశారు. మూడు రాజధానుల వల్ల ఏ ప్రాంతానికి నష్టం ఉండదని అమరావతి ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే మద్దాల గిరి స్పష్టం చేశారు. చంద్రబాబుకు తప్ప ప్రజలకు నష్టం లేదని.. ఐదేళ్లలో అమరావతిలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.

చంద్రబాబు విసిరిన రాజధాని రెఫరెండానికి తాను సిద్ధమని వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ప్రకటించారు. జగన్ ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను అని ముస్తాఫా సంచలన ప్రకటన చేశారు. జగన్ తమ అధినాయకుడని.. ఆయన చెప్పిన బాటలో నడవాలి కాబట్టి ఆయన ఓకే అంటే ఆ మరుక్షణమే రాజీనామా చేస్తాను అని అన్నారు.

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులా? అమరావతియా అనే దానిపై రెఫరెండానికి రెడీగా ఉండాలని కోరారు. రెఫరెండంపై రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ చేశారు. ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు వేస్తే చంద్రబాబు, నేను రాజకీయ సన్యాసం చేస్తామన్నారు.