Begin typing your search above and press return to search.

మరో వికెట్; సైకిల్ ఎక్కేసిన మణిగాంధీ

By:  Tupaki Desk   |   2 March 2016 11:31 AM IST
మరో వికెట్; సైకిల్ ఎక్కేసిన మణిగాంధీ
X
ఏపీ ముఖ్యమంత్రి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మహా జోరుగా సాగుతోంది. రెండురోజులకు ఒకరిద్దరు చొప్పున సైకిల్ ఎక్కేయటం జరుగుతుంది. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత మణి గాంధీ తాజాగా సైకిల్ ఎక్కేశారు. పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగినట్లే.. ఆయన తాజాగా టీడీపీలోకి చేరిపోయారు.

ఆయన ఏపీ అధికారపక్షంలోకి చేరే కార్యక్రమానికి కర్నూలు జిలలాకు చెందిన ముఖ్యనేత కేఈ కృష్ణమూర్తితో పాటు.. మంత్రులు యనమల.. అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే మణిగాంధీకి పచ్చ కండువా కప్పటం ద్వారా చంద్రబాబు ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు. తాజాగా సైకిల్ ఎక్కిన మణిగాంధీతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇదంతా పది రోజుల వ్యవధిలో జరగటం గమనార్హం. డజన్ కు పైగా జగన్ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారన్న అంచనాకు తగ్గట్లే చేరికల జోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇక.. పార్టీ చేరిన సందర్భంగా ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షణకు గురై.. తాను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో అధికారపార్టీలో చేరినట్లుగా వెల్లడించారు. అభివృద్ధికి ఆకర్షితుడిని అయ్యానంటూ మణిగాంధీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. ఆకర్షణ.. అభివృద్ధి గురించా? లేక.. అధికారం గురించా? అంటూ వ్యంగ్య వ్యాఖ్య పలువురి నోట వినిపిస్తోంది.