Begin typing your search above and press return to search.

లీకు వీరులకు చేతులు కట్టేస్తూ చర్యల కత్తి బయటకు తీశారు

By:  Tupaki Desk   |   28 Aug 2021 3:30 PM GMT
లీకు వీరులకు చేతులు కట్టేస్తూ చర్యల కత్తి బయటకు తీశారు
X
ప్రభుత్వానికి తలనొప్పిలా మారిన లీకులకు చెక్ చెప్పేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. ఇటీవల అప్పుల లెక్కలు ఏపీ సర్కారును ఇరుకున పడేసింది. అప్పుల తిప్పలు ఎంతన్న విషయాన్ని వివరాలతో సహా బయటకొచ్చిన సమాచారంతో వివక్షాలు చెలరేగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సాక్ష్యాధారాలతో సహా ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి వివరంగా చెప్పటంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో.. ఈ లీకులకు మూలం ఎక్కడ ఉందన్న విషయం మీద ఫోకస్ చేసిన ప్రభుత్వం.. ఆర్థిక శాఖలోని ముగ్గురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం.. తేడా వస్తే చర్యలు తప్పవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.

మరోవైపు బయటకు వచ్చిన వివరాలతో కోర్టులో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ధీంతో.. ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు.. అన్నింటికి మించి ఆర్థిక సంబంధమైన అంశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుల వ్యవహారాన్ని తొలుత తెలుగుదేశం పార్టీ టేకప్ చేయగా.. అనంతరం ఏపీ బీజేపీ నేతలు అందిపుచ్చుకొని జగన్ సర్కారుపై విమర్శనాస్త్రాల్ని సంధించారు.

అయితే.. బీజేపీ నేతలపై ఊహించని రీతిలో వైసీపీ నేతలు ఎదురుదాడి షురూ చేశారు. ముందు మా అప్పుల గురించి కాదు.. మీరు చేసిన అప్పుల మాటేమిటి? అంటూ ప్రశ్నించటంతో ఏపీ బీజేపీ నేతల నోటి నుంచి మాటలు రాని పరిస్థితి. ఓవైపు రాజకీయ రచ్చ ఇలా సాగుతుంటే.. మరోవైపు ప్రభుత్వ పరంగా లీకులకు ఉన్న అవకాశాల్ని మూసేలా చర్యలు మొదలు పెట్టారు. అంతేకాదు.. అసలు వివరాలు ఎలా బయటకు వస్తున్నాయన్న దానిపై ఫోకస్ చేసిన ప్రభుత్వానికి.. కీలక సమీక్షా సమావేశంలో ప్రస్తావించిన అంశాలు.. గణాంకాలు బయటకు వెళుతున్నట్లుగా గుర్తించారు.

దీంతో.. పవర్ పాయింట్ ప్రజంటేషన్లు.. సమీక్షా సమావేశాల సందర్భంగా సిద్ధం చేసిన నివేదికల్లో ఆర్థిక అంశాలకు సంబంధించిన వివరాల్ని పేర్కొనవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యంలో మంచిదేనా? అన్న చర్చ షురూ అయ్యింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదు. కాకుంటే మారిన రాజకీయంలో.. ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే కన్నా.. లేనిపోనివి చేర్చటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో.. ప్రభుత్వానికి కూడా కొన్ని అంశాల్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

పారదర్శకత ఉండాలే కానీ.. ప్రభుత్వాన్ని ఏదోలా ఇరుకున పెట్టాలన్న మైండ్ సెట్ కూడా సమాచారాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితికి కారణమైందంటున్నారు. ప్రభుత్వాన్ని ఏదోలా ఇరుకున పెట్టాలని భావిస్తున్న ప్రతిపక్షాలు దీన్ని ఏ రీతిలో హ్యాండిల్ చేస్తాయన్నది కాలమే సమాధానం ఇవ్వాలి.