Begin typing your search above and press return to search.

సీఎం రమేశ్ బిల్స్ క్లియర్ చేయించిన వైసీపీ పెద్ద నేత?

By:  Tupaki Desk   |   22 Nov 2019 12:02 PM GMT
సీఎం రమేశ్ బిల్స్ క్లియర్ చేయించిన వైసీపీ పెద్ద నేత?
X
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రమేశ్ ఏ స్థాయిలో చలామణి అయ్యారో వేరే చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితుడిగా మెలిగారు. బోలెడన్ని కాంట్రాక్టులను చేపట్టారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తూ బోలెడన్ని వ్యవహారాలను నడిపించారనే పేరునూ కలిగి ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అలా అధికారం కోల్పోయిందో లేదో.. ఇలా బీజేపీలోకి జంప్ చేసేశారు. అంతవరకూ చంద్రబాబుకు అతి సన్నిహితంగా మెలిగినా, టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆయన జంప్ అయిపోవడం గమనార్హం. అదంతా ఆయన కాంట్రాక్టుల కోసమే అనే ప్రచారం గట్టిగా సాగింది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బోలెడన్ని కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయించుకోవడం కోసమే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయినట్టుగా ఊహాగానాలు వినిపించాయి.

మరి ఏం జరిగిందో కానీ.. ఇప్పుడు సీఎం రమేశ్ కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు మొత్తం చకచకా క్లియర్ అవుతున్నట్టుగా భోగట్టా. పార్టీలు అధికారం చేతులు మార్చుకున్నప్పుడు కాంట్రాక్టర్లు అయిన రాజకీయ నేతలు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.

గతంలో వైసీపీలో ఉండిన నేతలది అలాంటి పరిస్థితే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ వారు పాత బిల్లులను రిలీజ్ చేయించుకోలేకపోయారు.

నానా కష్టాలు పడ్డారు కానీ చేసిన పనులకు కూడా వారు బిల్లులు విడుదల చేయించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు సీఎం రమేశ్ కు అలాంటి ఇబ్బంది కలగడం లేదట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక ముఖ్య నేతతో సీఎం రమేశ్ కు సాన్నిహిత్యం ఉందని, పార్టీలో ఆయనకు మంచి ప్రాపకం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అండతో… సీఎం రమేశ్ తన బిల్లులను చకచకా క్లియర్ చేయించుకుంటున్నట్టుగా ఒక ప్రచారం సాగుతూ ఉంది. మరి బడా వ్యాపార వేత్తలకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పనులు జరిగిపోతాయేమో అనే టాక్ కూడా నడుస్తూ ఉంది!