Begin typing your search above and press return to search.

క్రైం స్టోరీ... ఎవరీ యాసిన్ భత్కల్!

By:  Tupaki Desk   |   19 Dec 2016 4:10 PM GMT
క్రైం స్టోరీ... ఎవరీ యాసిన్ భత్కల్!
X
సినిమాల్లో ఉగ్రవాదుల గురించి - రౌడీల గురించి - డాన్ ల గురించి ఇంట్రడక్షన్స్ లో ఇప్పటివరకూ రాని స్థాయిలో ఉంటుంది అతడి చరిత్ర. క్రైం హిస్టరీలో అతడికి ఒక ప్రత్యేక స్థానం. భారత్ లోనే పుట్టిన ఇతడు భారత ఆర్థిక వ్యవస్థ నడ్డివిరవాలని కంకణం కట్టుకున్నాడు. చిన్న గ్రామంలో పుట్టి ఇండియన్ ముజాహిద్దీన్ కమాండర్ గా ఎదిగేవరకూ ప్రతీ ఒక్క స్టేప్ అత్యంత క్రూరంగా ఉంటుంది. చెప్పుకుంటూ పోతే కథలు కథలుగా ఇతగాడి నేర చరిత్ర ఉంటుంది. అతడే యాసిన్ భత్కల్.

యాసిన్ భత్కల్... ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. ఉత్తర కర్నాటకకు చెందిన భత్కల్ అనే గ్రామం ఇతని సొంతూరు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా చిన్నప్పటినుంచే తేడాగా బ్రతకడం మొదలుపెట్టిన ఇతడు బాంబుల తయారీలో ఎక్స్ పర్ట్! తన నేర చరిత్రను సొంతూరు భత్కల్ గ్రామం నుండే మొదలు పెట్టిన ఇతడు జీహాద్ అంటే చాలు పడి చస్తాడు. పదోతరగతి వరకు చదువుకున్న యాసిన్ చిన్నప్పుడే తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని ఇల్లు వదిలేశాడు. నాటినుంచి అతి భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్‌తో చేతులు కలిపాడు. అసలే రాక్షసుడు ఆ పై డ్రగ్స్ వాడాడు అనే స్థాయిలో రియాజ్, ఇక్బాల్ ల సహాయంతో ముజాహిద్దీన్లతో పరిచయం ఏర్పాటుచేసుకున్నాడు.

అలా ముజాహిద్దీన్‌లో చేరిన యాసిన్ భత్కల్ ఉగ్రవాద నేతల దృష్టిలో పడటం కోసం లక్షలాది రూపాయల విరాళాలు పోగేసాడు. ఫలితంగా ఉగ్రవాద సంస్థ దృష్టిలో కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇదే క్రమంలో 2008లో ఢిల్లీకి మకాం మార్చాడు. ఈ కరుడుగట్టిన ఉగ్రవాది జీవితంలో ప్రేమకథ కూడా ఉంది. మనుషులను చంపడంలో ఆనందాన్ని పొందే ఇతడు స్నేహితుడి చెల్లెలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఢిల్లీలో వరుస పేలుళ్లు జరిపి అక్కడ నుంచి పరారయ్యాడు. విధ్వంసాలకు స్కెచ్ వేయడం, దాన్ని పక్కాగా అమలు పరిచడంలో సిద్దహస్తుడైన ఇతడు... జైపూర్‌ లో వరుస పేలుళ్లు, జర్మన్ బేకరీ బ్లాస్ట్, చిన్నస్వామి స్టేడియలో జరిగిన విధ్వంసంతోపాటు ఢిల్లీలోని జామా మసీదు దగ్గర పేలుళ్లతోనూ సంబంధాలు కలిగిఉన్నాయి.

ఇలా వ్యూహాలు రచించడం, వాటిని పక్కాగా అమలు పరచడంతో ప్రమోషన్ ఇచ్చిన ఉగ్రవాద సంస్థ ఇతడిని ఇండియన్ ముజాహిద్దీన్ కమాండర్‌గా నియమించింది. ఇక అక్కడితో మరింతగా ముదిరిపోయాడు యాసిన్ భత్కల్. భారత ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నంచేసి నడ్డి విరవాలన్నదే ప్రధాన వ్యూహంగా మార్చుకున్న యాసిన్... బెంగళూరు, ముంబై లపైనే ప్రధానంగా దృష్టిసారించాడు. అందులో భాగంగానే చిన్నస్వామి స్టేడియంలో బాంబులు పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తుండడంతో బెంగళూరు నుంచి కోల్‌ కతాకు మకాం మార్చాడు. ఆ సమయంలోనే యాసిన్ భత్కల్ నిజస్వరూపం ప్రపంచానికి తెలిసింది. అనంతరం కోల్ కతా నుంచి హైదరాబాద్‌ కు మకాం మార్చాడు. వచ్చీ రాగానే దిల్‌ షుక్ నగర్ బాంబు పేలుళ్లలో కీలకంగా వ్యవహరించాడు. అమాయకులైన అనేకమంది ప్రజల ప్రాణాలు హరించాడు. చివరకు దొంగనోట్లను ముద్రించి చెలామణి చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు! తాజాగా ఎన్.ఐ.ఏ. న్యాయస్థానం ఇతడికి ఉరిశిక్ష విధించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/