Begin typing your search above and press return to search.

ఎవరీ యశ్వంత్ సిన్హా.. ఆయన ప్రస్థానం ఇది!

By:  Tupaki Desk   |   22 Jun 2022 3:23 AM GMT
ఎవరీ యశ్వంత్ సిన్హా.. ఆయన ప్రస్థానం ఇది!
X
ఎట్ట‌కేల‌కు ప్ర‌తిప‌క్షాల ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి అభ్య‌ర్థిని ప్ర‌తిప‌క్షాలు ఎంపిక చేశాయి. శ‌ర‌ద్ ప‌వార్, ఫ‌రూఖ్ అబ్దుల్లా, గోపాల‌కృష్ణ గాంధీ తిర‌స్క‌రించ‌డంతో చివ‌రి ప్ర‌య‌త్నంగా మాజీ కేంద్ర మంత్రి య‌శ్వంత్ సిన్హాను ప్ర‌తిప‌క్షాలు త‌మ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో నిల‌బెట్టాయి. మొత్తం 22 ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆయ‌న‌ను త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాయి. చివ‌ర‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా య‌శ్వంత్ సిన్హా అభ్య‌ర్థిత్వానికి ఆమోదం తెలిపార‌ని ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌క‌టించారు.

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో జూన్ 21న‌ ఢిల్లీలో స‌మావేశ‌మైన 18 ప్ర‌తిప‌క్ష పార్టీలు యశ్వంత్ సిన్హాను త‌మ అభ్య‌ర్థిగా నిర్ణ‌యించారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం రమేష్ అధికారికంగా ప్రకటించారు. మ‌రోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యశ్వంత్‌ సిన్హా కూడా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. జూన్ 27న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వెల్లడించారు. కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ నిర్వహించనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.

కాగా శరద్‌ పవార్‌ అధ్యక్షతన జరిగిన భేటీకి కాంగ్రెస్‌, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఏఐఎంఐఎం, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్‌ తదితర పార్టీలు హాజరయ్యాయి. మ‌రోవైపు టీఆర్ఎస్, బిజు జనతాదళ్‌, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్‌లు ఈ భేటీకి కూడా దూరంగా ఉన్నాయి. జూన్‌ 15న ప‌శ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన విపక్షాల భేటీకి కూడా ఈ పార్టీలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఎంపిక‌యిన య‌శ్వంత్ సిన్హా (84) నవంబర్‌ 6, 1937లో జన్మించారు. ఆయ‌న‌ విద్యాభ్యాసమంతా బీహార్‌లోని పాట్నాలో సాగింది. పాట్నా యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆయన.. 1960 వరకు బోధన కొనసాగించారు. ఆ తర్వాత 1960లో సివిల్స్‌ పాసై ఐఏఎస్‌గా సేవలందించారు. దాదాపు 24 ఏళ్ల పాటు అనేక పోస్టుల్లో పనిచేశారు. ఆ తర్వాత 1984లో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి.. క్రియాశీల రాజకీయాల్లోకి ప్ర‌వేశించారు. 1986లో జ‌న‌తా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సిన్హా.. 1988లో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు.

ఆ త‌ర్వాత మాజీ ప్ర‌ధాన‌మంత్రి వీపీ సింగ్‌ సారథ్యంలో జనతాదళ్‌ ఏర్పాటు కాగా.. ఆ పార్టీకి య‌శ్వంత్ సిన్హా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత జనతాదళ్‌ నుంచి చీలిపోయి సమాజ్‌వాదీ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ప్ర‌ధాని చంద్రశేఖర్‌ కేబినెట్‌లో 1990 నవంబర్‌ నుంచి 1991 జూన్‌ వరకు తొలిసారి కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1996లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1998, 1999ల్లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో మళ్లీ కేంద్ర ఆర్థికమంత్రి, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ లోని హజారీబాగ్ నుంచి 1996, 1998, 2004 ఎన్నిక‌ల్లో గెలుపొందారు. 2014లో బీజేపీ ఆయనకు సీటు నిరాకరించింది. ఆయన కుమారుడు జయంత్‌ను అక్కడి నుంచి బరిలో దించింది. న‌రేంద్ర మోడీతో విభేదించిన ఆయ‌న‌ 2018లో బీజేపీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే.. 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. యశ్వంత్‌ సిన్హాకు భార్య నీలిమ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతున్నారు.