Begin typing your search above and press return to search.

మోడీకి మూడో సంవత్సరం గండం

By:  Tupaki Desk   |   27 Jun 2016 9:20 AM GMT
మోడీకి మూడో సంవత్సరం గండం
X
ప్రధానిగా మూడో ఏట అడుగుపెట్టిన నరేంద్ర మోడీకి ఈ ఏడాది సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పాలనలో ఆయన దూసుకెళ్తున్నా కూడా పార్టీ వర్గాలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం విఫలమైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో మోడీపై నిరసన గళం విప్పుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. విపక్షాలను పక్కనబెడితే సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు మద్దతు లభించడం లేదు. ఎన్ ఎస్జీలో సభ్యత్వం కోసం స్వయంగా రంగంలోకి దిగిన మోదీ... కార్యరంగంలో విఫలమవడంతో బీజేపీ సీనియర్ నేత - కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మోడీపై మండిపడ్డారు.

కాగా ఎన్నికల సమయంలో పోటీ విషయంలో తాను అనుకున్నది సాధించుకోలేకపోయిన యశ్వంత్ సిన్హా అప్పట్లోనూ మోడీపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే.. ఆ తరువాత మాత్రం మోడీ కేబినెట్ లో తన కొడుకు జయంత్ సిన్హాకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి ఇప్పించుకోగలిగారు. అలాంటిది యశ్వంత్ ఇప్పుడు నేరుగా ప్రధానిపైనే ఎదురు దాడి చేయడం గమనార్హం. ఎన్డీయే గత ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా - విదేశాంగ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న యశ్వంత్ కు పార్టీలో క్రమంగా ప్రాధాన్యం తగ్గుతోంది. ఈ కారణంగా ఆయన చాలాకాలంగా అసంతృప్తిగానే ఉన్నారు. ఆర్థిక శాఖ - విదేశాంగ శాఖ చూసిన ఆయన ఆ రంగాల్లో పరిస్థితులపై అప్పుడప్పుడు స్పందించినా ఇలా మోడీని తీవ్రంగా విమర్శించిన సందర్భాలు లేవు.

న్యూక్లియర్ సప్లయ్ గ్రూపులో సభ్యత్వం కోసం మోడీ ప్రయత్నించి విఫలమైన నేపథ్యంలో యశ్వంత్ సిన్హా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్ ఎస్జీలో సభ్యత్వం భారత్ కు ఎందుకంటూ ఆయన మోడీ వైఖరిని తప్పుబట్టారు. ప్రస్తుతం అణ్వస్త్ర రంగానికి సంబంధించి భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని చెప్పిన యశ్వంత్... ఎన్ ఎస్జీలో సభ్యత్వంతో ఆ మెరుగైన పరిస్థితిని కోల్పోవాల్సి వస్తుందని కూడా కొత్త వాదన వినిపించారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అరుణ్ జైట్లీ స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిని తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్న కుమారుడు జయంత్ సిన్హాను ఆర్థిక మంత్రి చేయాలని యశ్వంత్ కోరగా మోడీ నిరాకరించడంతోనే ఆయన ఆరోపణలకు దిగారని అంటున్నారు. అయితే.. యశ్వంత్ వాదనతో మాత్రం కొందరు విదేశాంగ నిపుణులు ఏకీభవిస్తున్నారు. ఎన్ ఎస్జీ సభ్యత్వంతో మనకు దక్కేదేమీ లేకపోయినా కూడా ఇప్పుడు ఆ ప్రయత్నంలో విఫలమవడం వల్ల అంతర్జాతీయంగా స్థాయి తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

కాగా మోడీపై సొంత పార్టీలో విమర్శలు పెరుగుతుండడం... అంతర్జాతీయ సంబంధాల్లో వైఫల్యాలు.. ఆప్ నేత కేజ్రీవాల్ నుంచి తలనొప్పులు వంటివి మోడీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని.. మోడీ మూడో ఏడాది కష్టాలు ఎదురవుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.