Begin typing your search above and press return to search.

య‌శ్వంత్ కామెంట్‌: బీజేపీ గిల్టీ

By:  Tupaki Desk   |   11 Oct 2017 10:48 AM GMT
య‌శ్వంత్ కామెంట్‌: బీజేపీ గిల్టీ
X
బీజేపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర‌ మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా మ‌ళ్లీ ఫైర‌య్యారు. సొంత పార్టీ నేత‌లు అని కూడా చూడ‌కుండా ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ సార‌థి అమిత్ షాల‌ను దూది క‌న్నా దారుణంగా ఏకేశారు. మోదీ విధానం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ నాశ‌న‌మైపోయి.. దేశం గ‌డ్డు ప‌రిస్థితిలోకి జారిపోతోంద‌ని వారం కింద‌ట ఓ రేంజ్‌ లో ఫైరైపోయిన య‌శ్వంత్‌.. అమిత్‌ షా కుమారుడు జై షాపై అవినీతి ఆరోపణలు రావడంతో మ‌రింత ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ సారి.. ఆయ‌న పార్టీ మొత్తాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని సంచ‌ల‌న కామెంట్లు కుమ్మ‌రించారు. దీంతో దేశం మొత్తం నివ్వెర పోయింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ ఓ ప‌క్క బీజేపీని - మోదీని విమ‌ర్శిస్తుండ‌డం - మ‌రోప‌క్క గుజ‌రాత్ ఎన్నిక‌లు పొంచి ఉండ‌డం వంటి కార‌ణాల నేప‌థ్యంలో య‌శ్వంత్ పేల్చిన బాంబు ఇప్ప‌డు దీపావ‌ళిని ముందే చేసేసిన‌ట్టు అనిపిస్తోంది.

ఢిల్లీకి చెందిన ఓ ప‌త్రిక `ది వైర్‌` గ‌త రెండు రోజులుగా అమిత్ షా కుమారుడి నిర్వాకాల‌పై వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంది. ఈ క‌థ‌నాల‌ను టార్గెట్ చేసిన య‌శ్వంత్‌.. 'పలు పొరపాట్ల కారణంగా బీజేపీ ఇప్పుడు గిల్టీగా ఉన్నట్లు కనిపిస్తోంది. వ్యాపారవేత్త అయిన జై షా కోసం ప్రభుత్వ ఉన్నత న్యాయవాది అయిన తుషార్‌ మెహతాను కోర్టులో దించడం సరికాదు' అని నిప్పులు చెరిగారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జై ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయంటూ ది వైర్‌.. కథనం వెలువరించిన నేపథ్యంలో దానిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

అయితే, ఈ కేసును వాధించడానికి ప్రభుత్వ న్యాయవాది అయిన తుషార్‌ మెహతాను బీజేపీ నియ‌మించింది. దీనిని యశ్వంత్‌ సిన్హా తీవ్రంగా తప్పుబట్టారు. 'విద్యుత్‌ శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ అమిత్‌ షా కుమారుడికి రుణాన్ని మంజూరు చేసిన విధానం, ఆ తర్వాత ఆయననే వెనుకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించాలి. ఇందులో చాలా శాఖలు జోక్యం చేసుకున్నట్లు అనిపిస్తోంది' అంటూ ఆయన అన్నారు. అంతేకాదు, ఇది ఓ ప్రైవేటు వ్య‌క్తికి సంబంధించిన వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం న్యాయ‌వాదిని ఎలా నియ‌మిస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఇది ఇటు మోదీకి, అటు షాకి కూడా ఇబ్బంది క‌లిగించేలానే అనిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి దీనికి మోదీ అండ్ పార్టీ ఎలా స్పందిస్తాయో చూడాలి.